Delhi : దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రికార్డు వర్షపాతంతో పలు రహదారులపై నీరు నిలిచిపోగా, కాలనీలు నీట మునిగాయి. సదర్బజార్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కిషన్గంజ్ ప్రాంతంలో నీరు నిలిచిపోయిన ప్రదేశాలను స్ధానిక కౌన్సిలర్, ఎమ్మెల్యేతో కలిసి ఢిల్లీ ఎంసీడీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ ఆదివారం సందర్శించారు.
80 ఏండ్లలో ఎన్నడూ లేనంత వర్షపాతం నమోదవడంతో ఈ పరిస్ధితి నెలకొందని ఆమె పేర్కొన్నారు. కుండపోతతో పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయిందని, ఎంసీడీ అధికారులు సిబ్బంది కలిసి పరిస్ధితిని చక్కదిద్దేందుకు కలిసి పనిచేస్తున్నారని తెలిపారు. త్వరలోనే రహదారులు, కాలనీల్లో వరద నీటిని సిబ్బంది క్లియర్ చేస్తారని ఆమె పేర్కొన్నారు.
మరోవైపు ఈశాన్య రాష్ట్రం అసోంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. పలుచోట్ల ఇండ్లు నీట మునిగాయి. పంట పొలాలు దెబ్బతిన్నాయి. పలు ఏరియాలు తటాకాలను తలపిస్తున్నాయి.
రహదారులపై వరదలు పోటెత్తి నదులను తలపిస్తున్నాయి. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వరదల కారణంగా బ్రహ్మపుత్ర నదికి వరద పెరిగింది. ప్రస్తుతం బ్రహ్మపుత్ర నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. దాంతో నదీ పరివాహన ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. సురక్షిత ప్రాంతాలకు తరలిరావాలని సూచించారు.
Read More :