Arvind Kejriwal | ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. పిటిషన్పై స్పందన చెప్పాలని సీబీఐని ఆదేశించింది. కేసు విచారణను జూలై 17కి వాయిదా వేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో ఇప్పటికే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ను జూన్ 26న సీబీఐ అరెస్టు చేసింది. అదే నెల 20న ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడంతో మధ్యంతర స్టే విధించింది. మధ్యంతర స్టేను సవాల్ చేయడగా.. హైకోర్టు తోసిపుచ్చింది. మరో వైపు జూన్ 29న కేజ్రీవాల్ను సీబీఐ కస్టడీలోకి తీసుకున్నది. ప్రస్తుతం జూలై 12 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
సీబీఐ నిబంధనలు ఉల్లంఘించిందని పిటిషన్లో కేజ్రీవాల్ పేర్కొన్నారన్నారు. తనను అరెస్టు చేయడానికి ముందు అవసరమైన విధానాలను అనుసరించడంలో దర్యాప్తు అధికారి విఫలమయ్యారని.. అరెస్టు చట్టవిరుద్ధమన్నారు. తనను కస్టడీ నుంచి విడుదల చేయాలని.. సీబీఐ చర్యలు చెల్లవని వాదనలు వినిపించారు. 2022లో ఎఫ్ఐఆర్ నమోదైన దాదాపు రెండేళ్ల తర్వాత అరెస్టు చేయడం అన్యాయమని కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదించారు. ఈడీ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉ న్నారు. కేజ్రీవాల్ ఇప్పటికే ప్రత్యేక కేసులో కస్టడీలో ఉన్నందున, అత్యవసరంగా అరెస్టు చేయాల్సిన అవసరం లేదన్నారు. అరెస్ట్ మెమోకు సరైన కారణాలు ఉండాలన్నారు.