Sanjay Singh | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను సీబీఐ అరెస్టు చేయడంపై ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు సీబీఐ అరెస్టు చేసిందని ఆరోపించారు. అరవింద్ కేజ్రీవాల్కు వ్యతిరేకంగా ఈడీ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని.. దర్యాప్తు సంస్థ దురుద్దేశంతోనే ఈ పని చేస్తుందని కోర్టు (రౌస్ అవెన్యూ కోర్టు) తన ఆర్డర్లో పేర్కొందన్నారు. ఈడీ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని.. డబ్బులు రికవరీ చేయలేదన్నారు. అరవింద్ కేజ్రీవాల్ నిర్దోషి అన్నారు. ఈడీ ఉత్తర్వుల కాపీని తీసుకోకుండా.. రాజ్యాంగ విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా హైకోర్టును ఆశ్రయించి ఆ బెయిల్పై స్టే తీసుకువచ్చిందన్నారు.
ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ను సీబీఐ అరెస్టు చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ ఆదేశాలతో అరెస్టు చేసిందన్నారు. కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు నుంచి బెయిల్ రావడం ఖాయమని.. ఆ సమయంలో మోదీ ప్రభుత్వం సీబీఐని వెళ్లి అరెస్టు చేయాలని చెప్పిందని.. దర్యాప్తు సంస్థలను ఎంత బహిరంగంగా దుర్వినియోగం చేస్తున్నారో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ మరొకటి ఉండదంటూ విమర్శలు గుప్పించారు. ప్రధాని ఎలాంటి దురుద్దేశంతో పని చేస్తున్నారో దేశం మొత్తం చూస్తోందని.. మీ ఈడీ, సీబీఐ చర్యలకు వ్యతిరేకంగా రేపు భారత కూటమికి చెందిన అన్ని పార్టీలు పార్లమెంట్ హౌస్లో నిరసన తెలుపుతాయన్నారు. ఈడీ, సీబీఐ దుర్వనియోగానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామన్నారు.