Karnataka | బెంగళూరు, జూలై 1: కర్ణాటక కాంగ్రెస్లో పవర్ పాలిటిక్స్ తారస్థాయికి చేరుకున్నాయి. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదికే సీఎం కుర్చీ కోసం కొట్లాట ముదురుతున్నది. పార్టీ ఇచ్చిన వార్నింగ్లను లెక్కచేయకుండా ఎమ్మెల్యేలు బాహాటంగానే తమ డిమాండ్లు వినిపిస్తున్నారు. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా కొనసాగేలా చూసేందుకు ఆయన వర్గం ఎమ్మెల్యేలు, డీకే శివకుమార్ను సీఎంను చేసేందుకు ఆయన వర్గీయులు పావులు కదుపుతున్నారు. ఈ మొత్తం తతంగాన్ని సిద్ధరామయ్య, డీకే శివకుమార్ తెరవెనుక నుండి నడిపిస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది.
గత ఏడాది మే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అప్పుడు కూడా ముఖ్యమంత్రి పదవి కోసం పీఠముడి నెలకొన్నది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ కుర్చీ కోసం తీవ్రంగా పోటీ పడ్డారు. చివరకు సిద్ధరామయ్యనే అదృష్టం వరించింది. అయితే, అప్పుడు ముఖ్యమంత్రి పదవిని మొదటి రెండున్నరేండ్లు సిద్ధరామయ్యకు, తర్వాతి రెండున్నరేండ్లు డీకే శివకుమార్కు ఇచ్చేలా ఒప్పందం జరిగిందనే ప్రచారం జరిగింది. ఈ ఒప్పందం నిజమే అయితే మరో ఏడాదిన్నరలో ముఖ్యమంత్రి మార్పు ఉండనుంది. అందుకే, ఇప్పటి నుంచి సిద్ధరామయ్య, డీకే వర్గాలు పదవి కోసం పావులు కదుపుతున్నట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా, ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయేందుకు సిద్ధరామయ్య సిద్ధంగా ఉన్నారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవిని వదులుకొని డీకే శివకుమార్ను అప్పగించాలనే డిమాండ్లు పెరిగాయి. ఇటీవల సీఎం పదవి నుంచి తప్పుకొని డీకే శివకుమార్కు ఇవ్వాలని విశ్వ ఒక్కలిగ మహసంస్థాన మఠానికి చెందిన చంద్రశేఖర స్వామి నేరుగా సిద్ధరామయ్యనే కోరారు. చెన్నగిరి ఎమ్మెల్యే శివగంగ బసవరాజ్ కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు. డీకే శివకుమార్ వల్లే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందని, ఆయనను ముఖ్యమంత్రిని చేయాలని ఆయన పదేపదే కోరుతున్నారు. డీకే శివకుమార్ క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేశారని, ఆయన సీఎం కావాలని అంటున్నారు. ఏడాదిన్నరలో ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని డీకే వర్గీయులు ఈ డిమాండ్లను తెరపైకి తెచ్చారనే ప్రచారం జరుగుతున్నది.
ఇదే సమయంలో డీకే శివకుమార్కు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్లోనే ప్రయత్నాలు తీవ్రమయ్యాయి. డీకే తన పీసీసీ అధ్యక్ష పదవిని వదులుకోవాలని కొందరు నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు డీకే ఒక్కరే ఉప ముఖ్యమంత్రిగా ఉండగా, మరో ముగ్గురిని కూడా ఉపముఖ్యమంత్రులను చేయాలని మంత్రి రాజన్న సహా మరికొందరు కోరుతున్నారు. ముఖ్యమంత్రి మార్పు ఉండకుండా చూసేందుకు డీకేకు ఇప్పటినుంచే చెక్ పెట్టేలా సిద్ధరామయ్య వర్గం ఈ డిమాండ్లు తెర మీదకు తెచ్చిందనే ప్రచారం జరుగుతున్నది. ముఖ్యమంత్రి పదవి విషయమై కాంగ్రెస్ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా తాము పాటిస్తామని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సోమవారం ప్రకటించారు. డీకే శివకుమార్ కూడా హైకమాండ్ చెప్పిందే ఫైనల్ అంటున్నారు.