Hooch Tragedy : తమిళనాడులో నాటు సారా ఘటన రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏఐఏడీఎంకే, బీజేపీ ఈ ఘటనపై డీఎంకే సర్కార్ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నాయి. కళ్లకురిచి ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం ఎంకే స్టాలిన్ రాజీనామా చేయాలని ఏఐఏడీఎంకే నిరసనలు చేపట్టింది. రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతున్నా స్టాలిన్ సర్కార్ చోద్యం చూస్తోందని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సైతం విరుచుకుపడ్డారు. కల్తీ మద్యంతో దళితులు మరణిస్తున్నా డీఎంకే భాగస్వామి కాంగ్రెస్, ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీ మౌనం దాల్చారని మండిపడ్డారు.
మరోవైపు కళ్లకురిచి నాటు సారా ఘటనలో మృతుల సంఖ్య 58కి పెరిగిందని అధికారులు వెల్లడించారు. కల్తీ మద్యం సేవించిన అనంతరం రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 156 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో 110 మంది కళ్లకురిచి ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇక కళ్లకురిచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇప్పటివరకూ 32 మంది మరణించగా, సేలం ప్రభుత్వ ఆస్పత్రిలో 18 మంది, విల్లుపురం ఆస్పత్రిలో నలుగురు, పుదుచ్చేరి ఆస్పత్రిలో ముగ్గురు మరణించారు. కల్తీ సారా ఘటనలో మరణించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించగా, కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబాల్లోని పిల్లల విద్య, హాస్టల్ ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తెలిపారు.
తల్లితండ్రులను కోల్పోయిన పిల్లలకు వారికి 18 ఏండ్లు వచ్చేవరకూ నెలకు రూ. 5000 భృతి ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. తల్లితండ్రులు ఇద్దరినీ కోల్పోయిన పిల్లల పేరిట రూ. 5 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పధకాలన్నింటిలో వారికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.
Read More :
Begumpet Airport | బేగంపేట్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపులు