Karnataka | చిత్రదుర్గ, మే 21: కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో కరెంట్ కోతలు తీవ్రమయ్యాయి. విద్యుత్తు కోతలు సాధారణ ప్రజలపైనే కాకుండా దవాఖానలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. చిత్రదుర్గ జిల్లా మొలకల్మురు తాలూకా పరిధిలోని ఓ ప్రభుత్వ దవాఖానలో కరెంట్ లేకపోవడంతో చీకట్లు కమ్ముకొన్నాయి.
వైద్యులు సెల్ఫోన్ ఫ్లాష్లైట్ సాయంతో రోగులకు వైద్యం అందించాల్సిన దుస్థితి నెలకొన్నది. సెల్ఫోన్ లైట్ వెలుగులోనే సిబ్బంది రోగులకు మందులు ఇస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. గత వారం రోజులుగా ఆ ఏరియాలో విద్యుత్తు కోతలు నిత్యకృత్యంగా మారాయి.
ఇందులో కీలకమైన దవాఖానలకు కూడా ఎలాంటి మినహాయింపు లేకుండా పోయింది. ఈ పరిస్థితిపై ప్రతిపక్ష బీజేపీ విమర్శనాస్ర్తాలు సంధించింది. కాంగ్రెస్ సర్కార్ ఏడాది పూర్తి చేసుకొంటున్న సందర్భంగా హస్తం పార్టీ రాష్ట్ర ప్రజలకు మరో ‘గ్యారెంటీ’గా ‘చీకటి భాగ్య’ బహుమతిగా అందజేసిందని ఎద్దేవా చేసింది.
దవాఖానలో చీకట్లకు సంబంధించిన వీడియోలను కూడా కర్ణాటక బీజేపీ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. దవాఖానలకు కూడా విద్యుత్తు అందించలేని విపత్కర పరిస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం చేరిందని విమర్శించింది. ఖజానా ఖాళీ అయిందని, రాష్ట్రంలో తగినంత విద్యుత్తు సరఫరా లేదని పేర్కొన్నది.