CMP | తిరువనంతపురం, జూన్ 29: మనీ లాండరింగ్ ఆరోపణల కేసులో సీపీఎంను నిందితుల జాబితాలో చేర్చేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సిద్ధమవుతున్నది. కేరళలోని త్రిస్సూర్లో ఉన్న కరువన్నూర్ కోఆపరేటీవ్ బ్యాంక్లో నిధుల గోల్మాల్కు సంబంధించిన కేసును ఈడీ గత ఏడాది నుంచి విచారిస్తున్నది. సీపీఎం ఆధ్వర్యంలో నడిచే ఈ బ్యాంకులో సిబ్బంది, స్థానిక సీపీఎం నేతలు రూ.300 కోట్లకు పైగా నిధులను స్వాహా చేశారనే ఆరోపణలు వచ్చాయి.
రాష్ర్టాన్ని కుదిపేసిన ఈ వ్యవహారంలో సీపీఎం ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఏసీ మోయిదీన్కు బ్యాంకు బినామీ లోన్లను మంజూరు చేసిందని ఈడీ గత ఏడాది పేర్కొన్నది. మోయిదీన్ గతంలో త్రిస్సూర్ జిల్లా సీపీఎం కార్యదర్శిగా పని చేశారు. అయితే ఈ కేసులో సీపీఎం ప్రమేయం కూడా ఉందని ఈడీ భావిస్తున్నది. ఇప్పటికే పార్టీకి చెందిన కార్యాలయ స్థలం, వేర్వేరు బ్యాంకుల్లో ఉన్న రూ.60 లక్షలను ఈడీ అటాచ్ చేసింది. ఇప్పుడు పార్టీని సైతం నిందితుల జాబితాలో చేర్చేందుకు సిద్ధమైనట్టు సమాచారం.
ఈడీ కేసును న్యాయపరంగా, రాజకీయంగా ఎదుర్కొంటామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్ ప్రకటించారు. కాగా.. గత నెల ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన కేసులో మనీలాండరింగ్ ఆరోపణలతో ఆమ్ ఆద్మీ పార్టీపై ఈడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఒక రాజకీయ పార్టీని నిందితుల జాబితాలో చేర్చడం అదే మొదటిసారి.