NEET Issue : నీట్ పరీక్షల వివాదంపై కాంగ్రెస్ ఎంపీ, ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ స్పందించారు. నీట్ రగడపై పార్లమెంట్ వేదికగా తాము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని అన్నారు. ఈ ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) ఏం చేస్తుందనే విషయంపై తమ డిమాండ్లను లోక్సభ, రాజ్యసభ ముందుంచుతామని చెప్పారు. అన్ని పరీక్షలను ఎన్టీఏ ప్రైవేట్ కంపెనీల ద్వారా నిర్వహిస్తోంది, స్కామ్లు ఎక్కడ నుంచి వెలుగుచూస్తున్నాయో గమనించాలని అన్నారు.
బీజేపీ పాలిత రాష్ట్రాలు బిహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ల నుంచే ఈ స్కామ్లు బయటపడుతున్నాయని వివరించారు. ఈ వ్యవహారంపై చర్చ జరగాలని తాము పట్టుబడతామన్నారు. విద్యాశాఖ మంత్రి తొలుత పరీక్షల్లో అక్రమాలు లేవని అన్నారని, ఆపై చిన్నపాటి తప్పులు చోటుచేసుకున్నాయని చెప్పారని గుర్తుచేశారు. ఇప్పుడు సీబీఐ విచారణ, ఉన్నతస్ధాయి కమిటీ ఏర్పాటు గురించి మాట్లాడుతున్నారని జైరాం రమేష్ పేర్కొన్నారు.
నీట్ వివాదం, ప్రశ్నాపత్రాల లీకేజ్, నీట్-యూజీ పరీక్ష రద్దు వంటి అంశాలకు బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నీట్ విషయంలోనే కాకుండా నెట్, యూజీ, ఎన్సీఈఆర్టీకి సంబంధించి అంశాలున్నాయని చెప్పారు. విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే వ్యవస్ధలన్నీ ఈ వ్యవహారాలతో ముడిపడిఉన్నాయని పేర్కొన్నారు. ఎన్టీఏ సైతం విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుందని చెప్పుకొచ్చారు.
ఎన్టీఏ తన విధులను ప్రైవేట్ కంపెనీలకు పనులు అప్పగించడం ద్వారా ఎలా చేతులు దులుపుకుంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత ప్రశ్నించారు. మరోవైపు నీట్ వ్యవహరంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విపక్షాలు భగ్గుమన్నాయి. విద్యా మంత్రిత్వ శాఖను ప్రక్షాళన చేయాలని, నీట్ వివాదంపై అత్యున్నత స్ధాయి విచారణ చేపట్టాలని, విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
Read More :
Kalki 2898 AD | ‘కల్కి’ నుంచి ‘టక టక్కర’ ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్