“రాజ్యాంగంలోని పదో షెడ్యూలు ప్రకారం శాసనసభ స్పీకర్ వ్యవస్థ, ఒక ట్రిబ్యునల్ వంటిది. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్ల మీద వారు నిర్ణీత సహేతుక కాల వ్యవధిలో నిర్ణయం తీసుకోవడం తప్పనిసరి. కొన్ని అసాధారణ సందర్భాలను మినహాయిస్తే, నిర్ణీత కాల వ్యవధి అంటే, అనర్హత దరఖాస్తు ఇచ్చిన తర్వాత గరిష్ఠంగా 3 నెలల లోపలే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది! పదో షెడ్యూలు మేరకు అనర్హత వేటు వేసి, రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయాలంటే, స్పీకర్ 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవడం తప్పనిసరి”
– సుప్రీం కోర్టు ధర్మాసనం
Supreme Court | న్యూఢిల్లీ, జూన్ 27 (నమస్తే తెలంగాణ): ఒక పార్టీ నుంచి ఎన్నికైన ప్రజా ప్రతినిధి (ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ) మరో పార్టీలోకి దూకడం, అధికారం కోల్పోయిన పార్టీ నుంచి గెలిచి, అధికారం సాధించిన పార్టీలోకి మారడం, కండువాలు మార్చుకోవడం, కప్పదాట్లు వేయడం, స్పీకర్ సాచివేత వైఖరి, కోర్టు కేసుల వాయిదా నడుమ పబ్బం గడుపుకోవడం, పదవులు చేపట్టడం.. ఇవన్నీ ఒకప్పుడు చెల్లాయేమో కానీ, ఇప్పుడు చెల్లుబాటయ్యే అవకాశం ఎంతమాత్రమూ లేదు. సుప్రీంకోర్టు ఇటీవలి కాలంలో ఇచ్చిన కీలక తీర్పులే ఇందుకు కారణం.
దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను బట్టి చూస్తే, పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో నిర్ణయాన్ని స్పీకర్లు ఇక ఏండ్ల తరబడి ఎంతమాత్రం వాయిదా వేయలేరు. తప్పనిసరిగా వారు నిర్ణీత కాలవ్యవధి అంటే మూడు నెలల్లోపే నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు, ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి ఫిరాయించే ఎమ్మెల్యేలపై కచ్చితంగా అనర్హత వేటు కూడా పడనున్నది. అంటే వారు తమ శాసన సభ్యత్వాన్ని కోల్పోవడం ఖాయమన్న మాట. కోరల్లేని పాములా మారిన ఫిరాయింపు నిరోధక చట్టం, పార్టీ మార్పిడులను ఆపలేక పోతున్న నేపథ్యంలో, తన ముందుకు వచ్చిన రెండు కేసులపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పులను వెలువరించింది.
మణిపూర్ అసెంబ్లీ స్పీకర్ తదితరులపై కైషమ్ మేఘచంద్ర సింగ్ వేసిన తొలి కేసులో జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ రామసుబ్రమణ్యంతో కూడిన ధర్మానసం 2020 జనవరి 21న తీర్పు వెలువరించగా, మహారాష్ట్ర గవర్నర్, తదితరులపై సుభాష్ దేశాయ్ వేసిన మరో కేసులో చీఫ్ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ షా, జస్టిస్ కృష్ణమురారి, జస్టిస్ హిమాకోహ్లి, జస్టిస్ నర్సింహతో కూడిన ఐదురుగు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం.. మే 11, 2023న అంటే కేవలం ఏడాది కిందట మరో తీర్పుని వెలువరించింది. పార్టీ ఫిరాయించిన ప్రజా ప్రతినిధుల విషయంలో ఏం చేయాలి? ఎలా చేయాలనే దాన్ని సుప్రీంకోర్టు ఈ తీర్పుల్లో సవివరంగా పేర్కొన్నది. ‘ఎమ్మెల్యేల అనర్హత-స్పీకర్ అధికారాలు-నిర్ణయం తీసుకోవాల్సిన సమయం’ గురించి రాజ్యాంగంలోని పదో షెడ్యూలు-2(1)(ఎ) సవివరంగా పేర్కొన్నదని కూడా సుప్రీం ధర్మాసనాలు స్పష్టంచేసాయి. సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుతో ఫిరాయింపులపై అదే లా ఆఫ్ది ల్యాండ్గా మారిపోయిందని, అందువల్ల అన్ని వ్యవస్థలూ దాన్నే పాటించాల్సి ఉంటుందని రాజ్యాంగ నిపుణులు పేర్కొంటున్నారు.
‘రాజ్యాంగంలోని పదో షెడ్యూలు ప్రకారం శాసనసభ స్పీకర్ వ్యవస్థ.. ఒక ట్రైబ్యునల్ (న్యాయ ప్రాధికార సంస్థ) వంటిది. అందువల్ల ఫిరాయించిన ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్ల మీద వారు నిర్ణీత సహేతుక కాల వ్యవధిలో నిర్ణయం తీసుకోవడం తప్పనిసరి. కొన్ని అసాధారణ సందర్భాలను మినహాయిస్తే, నిర్ణీత సహేతుక కాల వ్యవధి అంటే, అనర్హత దరఖాస్తు ఇచ్చిన తర్వాత గరిష్ఠంగా మూడు నెలల లోపలే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది! నిబంధనలను ఉల్లంఘించి పార్టీ ఫిరాయించిన వారిపై పదో షెడ్యూలు మేరకు అనర్హత వేటు వేసి, రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయాలంటే, స్పీకర్ మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవడం తప్పనిసరి’ అని సుప్రీం న్యాయమూర్తులు తేల్చి చెప్పారు.
‘లోక్సభ లేదా అసెంబ్లీ కాలపరిమితి సాధారణంగా ఐదేండ్లు మాత్రమే. దీన్ని దృష్టిలో పెట్టుకునే, స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి 3 నెలల గరిష్ఠ పరిమితి విధించింది. రాజ్యాంగం పదో షెడ్యూల్లోని నిబంధనలను ఉల్లంఘించి, అనర్హతకు పాత్రులయ్యే ప్రజాప్రతినిధులకు ఒక్కరోజు కూడా ఎంపీ లేదా ఎమ్మెల్యేగా కొనసాగే హక్కు ఉండదు. రాజేంద్రసింగ్ రాణా కేసులో కూడా ధర్మాసనం ఇదే విషయాన్ని స్పష్టంచేసింది’ అని సుప్రీంకోర్టు ప్రకటించింది. అనర్హత పిటిషన్లపై మధ్యంతర నిర్ణయాలకు ఆస్కారం లేదని, తుది నిర్ణయమే వెల్లడించాల్సి ఉంటుందని కూడా ధర్మాసనం పేర్కొన్నది.
‘రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లో పేర్కొన్న నిబంధనల ప్రకారం, ఒక సభ్యుడి అనర్హతపై స్పీకర్ సత్వర నిర్ణయం తీసుకోవడానికి న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవాలనుకుంటే కచ్చితంగా చేసుకోవచ్చు. స్పీకర్ నిర్ణయాలపై న్యాయ సమీక్షను కిహోటో హోలోహాన్ కేసు తీర్పు (1992)లోని 110, 111 పేరాలు ఏవిధంగానూ అడ్డుకోవడం లేదు. అనర్హతపై స్పీకర్ తుది నిర్ణయం తర్వాత న్యాయ సమీక్షకు కచ్చితంగా అవకాశం ఉన్నది. ఒకవేళ స్పీకర్ తాత్కాలిక అనర్హత, లేదా సస్పెన్షన్ చర్యలు తీసుకుంటే, కోర్టు కూడా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వవచ్చు’ అని సుప్రీంకోర్టు పేర్కొన్నది.
‘ఒక ప్రజా ప్రతినిధికి శిక్షపడే విధంగా స్పీకర్ నిర్ణయాలు తీసుకుంటే, ఆ వ్యక్తి చట్టసభ సభ్యత్వానికి అనర్హుడవుతాడని, ఫలితంగా సుదీర్ఘ కాలంపాటు సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వస్తుందని, దీనివల్ల ఆయనకు కోలుకోలేని నష్టం కలుగుతుందనే వాదన అసంబద్ధం. అనర్హత వల్ల అతనికి జరిగే నష్టం కంటే, అనర్హుడైన వ్యక్తిని చట్టసభ సభ్యుడిగా కొనసాగిస్తే, ఆ నియోజకవర్గ ప్రజలపై తీవ్ర విపరిణామాలు ఉంటాయి.. అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
2017 ఏప్రిల్లో మణిపూర్లోని ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి చేరడంతో వారిపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ పిటిషన్ ఇచ్చింది. దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ ఖేమ్చంద్ మూడేండ్లపాటు తాత్సారం చేశారు. ఫిరాయించిన వారిలో ఒకరు (శ్యామ్కుమార్) మంత్రి పదవి కూడా పొందారు. తరువాత 2020లో రాజ్యసభ ఎన్నిక సందర్భంగా ఏడుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో నలుగురు మళ్లీ కాంగ్రెస్లోకి జంప్ చేశారు. దాంతో గతంలో కాంగ్రెస్ ఇచ్చిన పిటిషన్ ఆధారంగా స్పీకర్ వారిపై అనర్హత వేటు వేశారు. మిగతా ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ రాజ్యసభ అభ్యర్థికి ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కైషమ్ మేఘచంద్ర సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఈ కేసును వాదించారు. అనర్హత పిటిషన్లపై స్పీకర్ స్పందించకపోవడాన్ని, ఫిరాయించిన ఎమ్మెల్యేలను మంత్రులుగా నియమించడాన్ని సిబల్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంలో అత్యున్నత న్యాయస్థానం కీలకమైన ఆదేశాలను వెలువరించింది. ‘మణిపూర్ అసెంబ్లీ కాలపరిమితి మరో రెండేండ్లలోనే ముగియనుంది. అందువల్ల ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్, మేం ఈ తీర్పు ఇచ్చిన నాలుగు వారాల్లోనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
ఒకవేళ స్పీకర్ అలా చేయకుంటే మీరైనా, ఎవరైనా నిరభ్యంతరంగా సుప్రీంకోర్టుకు రావచ్చు. అప్పుడు దాని సంగతి మేం చూసుకుంటాం’ అని న్యాయమూర్తులు పేర్కొన్నారు. అనడమే కాదు, చర్యలు తీసుకొని చూపించింది కూడా! సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిన తర్వాత కూడా నాలుగు వారాల్లో స్పీకర్ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. దీంతో సుప్రీంకోర్టు శ్యామ్కుమార్ను మంత్రిపదవి నుంచి తొలగించింది. అతను అసెంబ్లీలో కాలు పెట్టకూడదని ఆదేశించింది. అనర్హత పిటిషన్లపై నిర్దేశిత గడువులోపు స్పీకర్ స్పందించకపోయినా, తమ ఆదేశాలను బేఖాతరు చేసినా, తానే స్వయంగా జోక్యం చేసుకుని, నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని సుప్రీంకోర్టు ఈ చర్యతో విస్పష్టమైన సంకేతాలు పంపింది.
అనర్హత పిటిషన్లపై నిర్ణయాధికారం ఎవరిదన్న విషయంలో సుప్రీంకోర్టు తన తీర్పుల్లో పూర్తిస్థాయి స్పష్టత ఇచ్చింది. రాజ్యాంగం ప్రకారం శాసన వ్యవస్థ వేరు, న్యాయ వ్యవస్థ వేరు. శాసన వ్యవస్థ (స్పీకర్) అధికారాల్లో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోలేదనే వాదనను సుప్రీంకోర్టు నిర్దంద్వంగా తోసిపుచ్చింది.
‘రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం ఒక సభ్యుడి అనర్హతపై నిర్ణ యం తీసుకునే అధికారం స్పీకర్, లేదా మండలి చైర్మన్కే ఉంటుందన్న మాట నిజమే. అయితే అదే పదో షెడ్యూలు, స్పీకర్ని ట్రైబ్యునల్ (ప్రత్యేక న్యాయ ప్రాధికార సంస్థ)గా పరిగణించిందని కిహోటో హోలోహాన్ కేసులో ధర్మాసనం తీర్పు చెప్పింది. దాని ప్రకారం రాజ్యాంగంలోని పదో షెడ్యూలు ఆధారంగా తీసుకునే నిర్ణయాలు కచ్చితంగా కోర్టుల అధికార పరిధి (జ్యూరిస్డిక్షన్)లోకి, అంటే న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తాయి. రాజ్యాంగంలోని 136, 226, 227 అధికరణాలు నిస్సందేహంగా దీన్నే రుజువు చేస్తున్నాయి’ అని ధర్మాసనం విస్పష్టంగా వివరించింది.
అనర్హత పిటిషన్లపై సంబంధిత వ్యవస్థల (స్పీకర్ లేదా చైర్మన్) కంటే ముందే, మొట్టమొదటగా తామే (న్యాయవ్యవస్థ) నిర్ణయం తీసుకోవడం సరికాదని, స్పీకర్ చట్టప్రకారం సరైన నిర్ణయం తీసుకోవడానికి తాము అవకాశం ఇస్తామని, అయితే స్పీకర్ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానిపై ఎవరైనా అప్పీలు చేస్తే, దాన్ని సమీక్షించి, తగు ఆదేశాలు ఇవ్వడానికి తాము సిద్ధమని వెల్లడించింది. అదే సమయంలో కొన్ని సంక్లిష్ట వాస్తవాలు, పరిస్థితుల్లో అనర్హత పిటిషన్ల న్యాయబద్ధతను తాము నిర్ణయిస్తామని అత్యున్నత న్యాయస్థానం వివరించింది. ఆ సందర్భాలు ఏమిటో కూడా వివరించింది. అవేమిటంటే…
1. ఒక సభ్యుడి అనర్హత పిటిషన్పై నిర్ణీత కాలవ్యవధిలో నిర్ణయం తీసుకోవడంలో స్పీకర్ విఫలమైతే
2. పిటిషన్ ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే అనర్హుడా కాదా అనేది ముందుగా నిర్ణయించకుండా, స్పీకర్ పార్టీలో చీలిక గురించిన నిర్ణయాన్ని తీసుకుంటే..
3. అనర్హత పిటిషన్లపై నిర్ణయాన్ని మూడేండ్లకు మించి స్పీకర్ పెండింగ్లో పెట్టడం, తద్వారా త్వరలో రాష్ట్ర శాసనసభ కాలపరిమితి ముగిసే పరిస్థితి ఉన్న కారణంగా పిటిషన్లపై సత్వర నిర్ణయం తీసుకోవాల్సిన అగత్యం ఏర్పడడం.
ఈ మూడు సందర్భాల్లో అనర్హత పిటిషన్లపై అధికారిక ప్రక్రియను, నిర్ణయాధికారాన్ని స్పీకర్కు అప్పగించడం వల్ల అనర్హత పిటిషన్లు నిరుపయోగం అవుతాయని, అందువల్ల అలాంటి సందర్భాల్లో అనర్హత పిటిషన్లను న్యాయ వ్య వస్థే తేలుస్తుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. తన అధికార పరిధిని వినియోగించడంలో స్పీకర్ విఫలం కావడం వల్ల పదో షెడ్యూలులోని 6వ పేరాలో ఉన్న రాజ్యాంగ రక్షణ ఆయనకు వర్తించదని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. అనర్హత పిటిషన్ను సహేతుకమైన గడువులోగా పరిష్కరించకుండా స్పీకర్ దూరంగా ఉన్నప్పుడు, ఆ అంశం సూమోటోగానే న్యాయవ్యవస్థ అధికార పరిధిలోకి వెళ్లిపోతుందని సుప్రీంకోర్టు తీర్పులో ఉన్నది.
ఫిరాయింపులు, అనర్హత పిటిషన్లపై స్పీకర్లు సత్వరమే నిర్ణయాలు తీసుకోకపోవడం, లేదా పక్షపాతపూరితంగా నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం భారత ప్రభుత్వానికి కొన్ని సూచనలు కూడా చేసింది. ‘ప్రత్యక్షంగానో, పరోక్షంగానో స్పీకర్ కూడా ఒక రాజకీయ పార్టీకి చెందినవాడే. అందువల్ల ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ జరిపే బాధ్యతను స్పీకర్లకు అప్పగించాలా, వద్దా అనే విషయంలో పార్లమెంటు పునరాలోచన చేయాల్సిన సమయం ఆసన్నమైంది.
ఎమ్మెల్యేల అనర్హత వివాదాలపై విచారణ వ్యవహారాన్ని లోక్సభ, అసెంబ్లీ స్పీకర్లకు అప్పగించే బదులు ఏదైనా ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటుచేసేలా రాజ్యాంగాన్ని సవరించే విషయాన్ని పార్లమెంటు సీరియస్గా పరిశీలించాలి. ఈ అనర్హతలకు సంబంధించిన వివాదాలకు మధ్యవర్తిగా రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేదా హైకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో శాశ్వత ట్రిబ్యునల్ లేదా మరేదైనా బయటి స్వతంత్ర యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. తద్వారా మన ప్రజాస్వామ్యం సక్రమంగా పనిచేయడంలో అత్యంత కీలకమైన పదో షెడ్యూలులోని నిబంధనలకు బలం చేకూర్చినట్టవుతుంది” అని ధర్మాసనం హితవు చెప్పింది.
ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేలు విడతల వారీగా బయటపడటం, మరో గ్రూపుగా ఏర్పడటం, తర్వాత ఇంకో పార్టీలో విలీనం కావడం గురించి కూడా సుప్రీంకోర్టు తన తీర్పులో ఆసక్తికరమైన సందర్భాలను ప్రస్తావించింది. ‘చీలిక-కొత్త శిబిరానికి గుర్తింపు-స్పీకర్ నిర్ణయాధికారం’ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. అనర్హత పిటిషన్ల సంగతి తేల్చిన తర్వాతే మిగతా వ్యవహారాల గురించి పరిశీలించాలని చెప్పకనే చెప్పింది. 2003లో సమాజ్వాదీ నేత ములాయంసింగ్ యూపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు.
బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)కి చెందిన కొందరు ఎమ్మెల్యేలను ఆయన తనకు మద్దతిచ్చేట్టు చేసుకున్నారు. తర్వాత మరో 13 మంది బీఎస్పీ ఎమ్మెల్యేలను కూడా ఆకట్టుకున్నారు. వీరందరిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ రాజేంద్రసింగ్ రాణాకు అప్పటి బీఎస్పీ నేత స్వామిప్రసాద్ మౌర్య ఫిర్యాదు చేశారు. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం ఏడాది క్రితం ఇచ్చిన తీర్పులో ఈ ఉదంతాన్ని ప్రస్తావించింది. ‘26.8.2003 నాడు స్పీకర్ బీఎస్పీలో చీలికను ఆమోదిస్తూ, లోక్తాంత్రిక్ బహుజన్దళ్ పేరుతో ప్రత్యేక గ్రూపుగా గుర్తింపును ఇచ్చారు. ఆ తర్వాత మరో 13 మంది ఎమ్మెల్యేలు బీఎస్పీని వీడారు. వీరిపై 4.9.2003న అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి.
తర్వాత ఈ 13 మంది ఎమ్మెల్యేలు కూడా లోక్తాంత్రిక్ బహుజన్దళ్ గ్రూపులో చేరారు. అనంతరం మొత్తం గ్రూపు సమాజ్వాది పార్టీలో విలీనమైంది. అయితే 13 మంది ఎమ్మెల్యేలపై దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోకుండానే స్పీకర్, ఈ విలీనాన్ని 6.9.2003న ఆమోదించారు. ఆ మరుసటి రోజున ఆయన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను తిరస్కరించారు. దీనిపై హైకోర్టును బీఎస్పీ ఆశ్రయించింది. దీంతో స్పీకర్ నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసింది. ఎమ్మెల్యేల మీద దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ విచారించాల్సిందేనని స్పష్టంచేసింది. తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని ఆదేశించింది. తద్వారా అనర్హత పిటిషన్లను విచారించి నిర్ణయాన్ని వెలువరించిన తర్వాతే, చీలిక గ్రూపుకు గుర్తింపు, ఇతర పార్టీల్లో విలీనం వంటి అంశాలను చేపట్టాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.