భువనేశ్వర్: పాఠశాల తరగతిలో తోటి విద్యార్థిని ఒక స్టూడెంట్ కత్తితో పొడిచాడు. (Student Stabs Classmate) తీవ్రంగా గాయపడిన ఆ విద్యార్థిని మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కత్తితో పొడిచిన 9వ తరగతి స్టూడెంట్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశాలోని గంజాం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం ఉదయం రాంచంద్రాపూర్లోని రఘునాథ్ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో తోటి విద్యార్థిని ఒక స్టూడెంట్ కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన ఆ విద్యార్థిని ఎంకేసీజీ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, స్కూల్ ప్రధానోపాధ్యాయుడు రఘునాథ్ ఫిర్యాదుతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. తోటి విద్యార్థిని కత్తితో పొడిచిన 14 ఏళ్ల స్టూడెంట్ను అదుపులోకి తీసుకున్నారు. స్కూల్ బ్యాగ్లో కత్తి కలిగిన విద్యార్థి క్లాస్లో టీచర్ లేనప్పుడు తన క్లాస్మేట్పై దాడి చేశాడని పోలీసులు తెలిపారు. బాధిత విద్యార్థి ఆకస్మికంగా రెచ్చగొట్టడం వల్ల ఈ సంఘటన జరిగినట్లు చెప్పారు. చికిత్స పొందుతున్న విద్యార్థి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.