స్పెషల్ టాస్క్ బ్యూరో హైదరాబాద్ (నమస్తే తెలంగాణ): చెన్నై విమానాశ్రయంలో ఇటీవల పట్టుబడ్డ 267 కిలోల బంగారం స్మగ్లింగ్ కేసు కొత్త మలుపు తిరిగింది. బీజేపీతో సంబంధాలున్న ఓ వ్యక్తే ఈ స్మగ్లింగ్లో కీలక సూత్రధారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాదు, అతనికి తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని స్థానిక మీడియాలో వార్తలు రావడం కలకలం సృష్టిస్తున్నది. ఈ స్కాం విచారణ సందర్భంగా అన్నామలై పేరు కూడా బయటకు వచ్చినట్టు ఆ మీడియా వర్గాలు తెలిపాయి. అయితే, అధికారికంగా నిర్ధారణ కాలేదు.
చెన్నై విమానాశ్రయంలో గత గురువారం ట్రాన్సిట్ చెకింగ్ వద్ద అనుమానంగా తచ్చాడుతున్న ఓ వ్యక్తిని చెన్నై ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్కు చెందిన అధికారులు కస్టడీలోకి తీసుకొన్నారు. చెక్ చేయగా మలద్వారంలో కేజీ వరకూ బంగారం పేస్టు రూపంలో ఉన్నట్టు గుర్తించారు. అధికారులు మరింత లోతుగా విచారించగా, డిపార్చర్ ఏరియా వద్ద ఉన్న ఎయిర్హబ్ గిఫ్ట్ షాప్ ద్వారా ఈ స్మగ్లింగ్ను జరుపుతున్నట్టు, గడిచిన రెండు నెలల్లోనే 267 కిలోల బంగారాన్ని ఇలా తరలించినట్టు నిందితుడు ఒప్పుకొన్నాడు. దీంతో షాప్ యజమాని, యూట్యూబర్ అలీ సబీర్తో పాటు మరో ఏడుగురిని అరెస్టు చేశారు.
స్మగ్లింగ్కు కేంద్రంగా మారిన గిఫ్ట్ షాప్ గత ఫిబ్రవరిలోనే ప్రారంభించడం, సబీర్కు ఈ వ్యాపారంలో ఎలాంటి అనుభవంలేకపోవడంతో అధికారులు కేసును మరింత లోతుగా పరిశీలించారు. దీంతో ఆ షాప్ ఉన్న ప్రాంతాన్ని విద్వేదా పీఆర్జీ ఎండీ, బీజేపీతో సంబంధాలు ఉన్న జీఏ పృథ్వీ అనే వ్యక్తి కిరాయికి ఇచ్చినట్టు తేలింది. తనకు షాప్ను కిరాయికి ఇచ్చేలా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులను పృథ్వీనే ఒప్పించారని విచారణలో సబీర్ తెలిపారు. దీంతో కేసుకు సంబంధం ఉన్న అధికారులను ప్రశ్నించిన పోలీసులు.. పృథ్వీ నివాసంలోనూ సోదాలు నిర్వహించారు. అయితే, అతను అమెరికాకు వెళ్లినట్టు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. కాగా.. బంగారం స్మగ్లింగ్ ద్వారా గడిచిన రెండు నెలల్లో సబీర్ రూ. 3 కోట్లు సంపాదించినట్టు సమాచారం.
పృథ్వీకి బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 2010లో పృథ్వీ తమిళనాడు బీజేపీ యూత్ వింగ్ కో-కన్వీనర్గా పనిచేశారు. కేంద్రమంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, పోన్ రాధాకృష్ణన్ వంటి వారి దగ్గర సహాయకుడిగా మరికొన్ని రోజులు పనిచేశారు.