న్యూఢిల్లీ: మాట్లాడాలనుకునే సభ్యుల మైక్ కట్ చేసేందుకు ప్రిసైడింగ్ ఆఫీసర్ల వద్ద స్విచ్ కానీ రిమోట్ కంట్రోల్ కానీ ఉండదని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా(Speaker Om Birla) అన్నారు. తాము మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో.. ప్రిసైడింగ్ ఆఫీసర్లు తమ మైక్రోఫోన్లను కట్ చేస్తున్నారని ఆరోపణలు చేసిన ఎంపీలను స్పీకర్ బిర్లా తప్పుపట్టారు. చైర్పై ఆరోపణలను చేయడం సరికాదన్నారు. ఆ ఆరోపణలను ఆందోళనకరంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. చైర్ కేవలం ఆదేశాలు మాత్రమే ఇస్తుందని, ఎవరి పేరును పిలిస్తే వాళ్ల మైక్ మాత్రమే ఆన్ అవుతుందని ఓం బిర్లా తెలిపారు. చైర్ ఆదేశాల ప్రకారమే మైక్ను కంట్రోల్ చేయడం జరుగుతుందన్నారు.
చైర్లో కూర్చున్న వ్యక్తి వద్ద మైక్రోఫోన్లను కంట్రోల్ చేసేందుకు స్విచ్ కానీ రిమోట్ కంట్రోల్ కానీ ఉండదన్నారు. స్పీకర్ సభలో లేని సమయంలో చైర్పర్సన్ ఎవరు ఉంటారన్న ప్యానెల్ స్పీకర్ల జాబితాలో అన్ని రాజకీయ పార్టీలకు అందుబాటులో ఉంటుందని బిర్లా తెలిపారు. చైర్ గౌరవానికి చెందిన అంశమని, చైర్లో కూర్చునే వ్యక్తి కూడా ఇలాంటి అభ్యంతరాలు చేయడం సరికాదు అని, కే సురేశ్ చైర్లో కూర్చుంటారని, నిజంగా చైర్ వద్ద మైక్ను కంట్రోల్ చేయగలడరా అని స్పీకర్ ప్రశ్నించారు.