న్యూఢిల్లీ: మాజీ ప్రధాని జవర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి నరేంద్ర మోదీ (PM Modi ) దేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆదివారం సాయంత్రం రాష్ట్రపతిభవన్లో జరుగనున్న ఈ కార్యక్రమానికి దక్షిణాసియా దేశాధినేతలు హాజరుకానున్నారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే ఆదివారం నాటి చారిత్రక ఘట్టానికి హాజరవుతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇక నేపాల్ ప్రధాని పుష్ప కమాల్ దహాల్ ప్రఛండ, భూటాన్, మారిషస్ ప్రధానులకు ఆహ్వానం అందించారు.
వీరితోపాటు మరికొందరు విశిష్ట అతిథులు కూడా ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్నారు. శానిటేషన్ సిబ్బంది, ట్రాన్స్ జెండర్లు, సెంట్రల్ విస్టా నిర్మాణంలో పాలుపంచుకున్న కార్మికులను ప్రత్యేక ఆహ్వానితులుగా పిలువనున్నారు. అదేవిధంగా వికసిత్ భారత్ అంబాసిడర్లయిన ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందినవారిని, వందేభారత్, మెట్రో రైళ్లలో పనిచేసే సిబ్బందిని ఆహ్వానించాలని అధికారులు నిర్ణయించారు. మొత్తంగా ఆదివారం సాయంత్రం అట్టహాసంగా జరుగనున్న ఈ కార్యమంలో సుమారు 8 వేల మంది పాల్గొంటారు.
ఈ నెల 4న వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 240 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ పార్టీ నేతృత్వంలోని భాగస్వామ్యపక్షాలన్నీ కలిసి 293 స్థానాల్లో గెలుపొందారు. దీంతో మరోసారి కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరనుంది.