న్యూఢిల్లీ, జూలై 2: నీట్ యూజీ-2024 పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా వివాదం నెలకొనటంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. నీట్ పీజీ పరీక్షకు రెండు గంటల ముందు మాత్రమే ప్రశ్నపత్రాన్ని ఫైనల్ చేయాలని అధికారులు యోచిస్తున్నారు. ఈ నెలాఖరులో లేదా ఆగస్టులో నీట్ పీజీ పరీక్ష ఉండొచ్చని తెలుస్తున్నది. రివైజ్డ్ షెడ్యూల్ను జూలై 2న ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. కానీ, మంగళవారం అలాంటి ప్రకటనలేవీ రాలేదు. కేంద్రం నుంచి ఆమోదం వచ్చాకే నిర్ణయం తీసుకోవాలని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అధికారి ఒకరు పేర్కొన్నారు.
జూలై 8న సుప్రీంకోర్టు విచారణ
నీట్ -యూజీ 2024లో అక్రమాలు చోటుచేసుకున్నందున పరీక్షను రద్దు చేయాలని, అక్రమాలపై విచారణ జరపాలని కోరుతూ దాఖలైన 26 పిటిషన్లను ఈ నెల 8న విచారించనున్నట్టు సుప్రీం కోర్టు ప్రకటించింది. నీట్ అక్రమాలపై గత నెల 11న విచారించిన సుప్రీంకోర్టు.. నీట్-యూజీ పరీక్ష పవిత్రత దెబ్బతిన్నదని వ్యాఖ్యానించింది. దీనిపై స్పందన తెలియజేయాలంటూ కేంద్రానికి, పరీక్ష నిర్వహించిన ఎన్టీఏను ఆదేశించింది. అయితే కౌన్సిలింగ్ ప్రక్రియ నిలిపివేయడానికి కోర్టు నిరాకరించింది.