న్యూఢిల్లీ, జూన్ 25: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో బుధవారం విచారణకు రానున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఆయన్ను సీబీఐ మద్యం పాలసీకి సంబంధించిన కేసులో మంగళవారం అరెస్టు చేసింది. సీబీఐ అధికారులు సోమవారం జైల్లోనే కేజ్రీవాల్ స్టేట్మెంట్ను రికార్డు చేశారు. సీబీఐ కేజ్రీవాల్ను బుధవారం ట్రయల్ కోర్టులో ప్రవేశపెట్టనున్నదని సంబంధిత వర్గాలు తెలిపాయి. సుప్రీంకోర్టు నుంచి 100 శాతం బెయిల్ వస్తుందని భావిస్తున్న తరుణంలో కేంద్రం కుట్రలు చేస్తున్నదని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు.
బెయిల్పై ఢిల్లీ హైకోర్టు స్టే: మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్కు ట్రయల్ కోర్టు మంజూరు చేసిన బెయిల్పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ఈడీ వేసిన సవాల్ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం మంగళవారం ఈ మేరకు తీర్పునిచ్చింది. ఈడీ సమర్పించిన వివరాలను పరిగణనలోకి తీసుకోవడంలో ట్రయల్ కోర్టు విఫలమైందని, కేజ్రీవాల్కు బెయిల్పై నిర్ణయం తీసుకొనే సమయంలో ఆలోచన చేయలేదని వెకేషన్ బెంచ్ పేర్కొన్నది.