Cash For Marks Scam | న్యూఢిల్లీ: బీజేపీ పాలిత అస్సాంలో ‘మార్కుల కోసం నగదు’ కుంభకోణం బయటపడింది. మార్కుల జాబితాలను డిజిటల్ ట్యాంపరింగ్ చేస్తుండటాన్ని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు.
అజీజుల్ హక్ అనే విద్యార్థి మార్కుల జాబితాలో పొంతనలేని మార్కులపై గణేశ్ లాల్ చౌదరి కళాశాల అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విద్యార్థి వాస్తవంగా పొందిన మార్కుల కన్నా మార్కుల జాబితాలో ఉన్న మార్కులు ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు.
దీనిపై సీఐడీ దర్యాప్తు జరుపుతున్నది. మరికొందరు అరెస్టయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. పోలీసులు ప్రశ్నించినపుడు ఈ విద్యార్థి నేరాన్ని అంగీకరించాడు.