న్యూఢిల్లీ: తల, మెడ భాగంలో క్యాన్సర్ సోకిన బాధితుల్లో(Cancer Patients).. ఇండియాలో అవే 26 శాతం కేసులు ఉన్నట్లు తాజా సర్వే ద్వారా వెల్లడైంది. దేశంలో ఇలాంటి కేసుల సంఖ్య పెరుగుతోందని రుజువైంది. వరల్డ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ డే సందర్భంగా రిపోర్టును రిలీజ్ చేశారు. 1869 మంది క్యాన్సర్ పేషెంట్లపై నిర్వహించిన అధ్యయనం ఆధారంగా ఈ నివేదికను వెల్లడించారు. ఢిల్లీకి చెందిన ఎన్జీవో క్యాన్సర్ ముక్త భారత్ ఫౌండేషన్ ఈ సర్వే చేపట్టింది. మార్చి 1 నుంచి జూన్ 30 మధ్య హెల్ప్లైన్ నెంబర్కు వచ్చిన ఫోన్ కాల్స్ ఆధారంగా ఈ రిపోర్టు తయారు చేశారు.
తల, మెడ క్యాన్సర్ కేసులు ఎక్కువగా యువకుల్లో నమోదు అవుతున్నట్లు సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఆశిష్ గుప్తా తెలిపారు. పోగాకు వాడకం పెరగడం, హ్యూమన్ పాపిల్లోమావైరస్ ఇన్ఫెక్షన్ వల్ల కేసులు అధికం అవుతున్నట్లు తెలుస్తోంది. 90 శాతం వరకు నోటి క్యాన్సర్ రోగులు పోగాకు వాడినట్లు తెలుస్తోందన్నారు. పొగాకు వాడకాన్ని నిషేధిస్తే, చాలా వరకు క్యాన్సర్ ముప్పు నుంచి బయటపడే అవకాశం ఉన్నట్లు డాక్టర్ ఆశిష్ గుప్తా చెప్పారు.