న్యూఢిల్లీ: ఒకరి బలాల నుంచి మరొకరు నేర్చుకోవచ్చని చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ అన్నారు. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు భారత్కు ఆయన చేరుకున్నారు. ఏడేళ్ల తర్వాత ఇండియాకు వచ్చిన చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్కు ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. (Jinping With PM Modi) ఆ తర్వాత ఇరు దేశాధినేతలు ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. సరిహద్దు సమస్యలు, వాణిజ్యం, పెట్టుబడులపై చర్చించారు.
కాగా, తన పుట్టిన రోజైన జూన్ 15న భారత్ పర్యటనకు ఆహ్వానం అందుకున్నట్లు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తెలిపారు. గత కొన్నేళ్లుగా తమ మధ్య జరిగిన 21 సమావేశాల ద్వారా తాను, ప్రధాని మోదీ కలిసి భారత్-చైనా సంబంధాలను స్థిరమైన అభివృద్ధి మార్గంలో నడిపించామని చెప్పారు. చైనా ఎల్లప్పుడూ భారత్తో తన సంబంధాలను వ్యూహాత్మక, దీర్ఘకాలిక దృక్పథంతో చూస్తూ మెరుగుపరుచుకున్నదని జిన్పింగ్ గుర్తు చేశారు. రెండు దేశాల పరిస్థితులు వేర్వేరుగా ఉన్నప్పటికీ, ఒకరి బలాల నుంచి మరొకరు పూర్తిగా నేర్చుకోవచ్చని, పరస్పరం సహకరించుకోవచ్చని, కలిసికట్టుగా విజయంతో పాటు ఉమ్మడి అభివృద్ధిని సాధించవచ్చని అన్నారు.
మరోవైపు శతాబ్ద కాలంలో ఎన్నడూ లేని భారీ మార్పులు, మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన రెండు దేశాలుగా, ‘గ్లోబల్ సౌత్’లో కీలక సభ్యులుగా చైనా, భారత్ ముఖ్యమైన బాధ్యతలు కలిగి ఉన్నాయని జిన్పింగ్ తెలిపారు. మానవాళి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ప్రజల శ్రేయస్సును పరిగణనలోకి తీసుకుని, ప్రధాన దేశాలుగా పాత్రను పోషించేందుకు భారత్, చైనా కలిసి పనిచేయాలని ఆయన సూచించారు. ఇరు దేశాలు కేవలం స్వప్రయోజనాలకే పరిమితం కాకూడదని, ప్రపంచ శాంతి, స్థిరత్వం, అభివృద్ధి, శ్రేయస్సు కోసం మరింత సానుకూల శక్తిని అందించాలని ఆయన పిలుపునిచ్చారు.