Ayodhya | అయోధ్య, జూన్ 27: యూపీలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన అయోధ్య రామమందిరంలో పైకప్పులో ఏర్పడిన లీకేజీల వల్ల వర్షం నీరు గర్భగుడిలోకి కారుతున్నదన్న వార్తలు ఆందోళన కలిగిస్తుండగా, అయోధ్య రామ మందిర రక్షణ బాధ్యతలు చూసే ప్రొవెన్షియల్ ఆర్మ్డ్ కానిస్టేబులరీ (పీఏసీ) జవాన్ల శిబిరాల్లోకి వరద నీరు చేరింది.
మీర్జాపూర్లోని కాన్షీరాం కాలనీలో ఉన్న వారి శిబిరాలు ఇప్పుడు నీట మునిగాయి. వారి వస్తువులన్నీ నీటిలో తేలియాడుతున్నాయి. శిబిరాల్లో మోకాలి లోతు నీరు నిలిచిపోవడంతో జవాన్లు ఏం చేయాలో దిక్కులేని స్థితిలో ఉన్నారు.
కాగా, అయోధ్య మందిరంలోని గర్భగుడి పైకప్పు నుంచి కారిన వాననీరు పేరుకుపోతున్నదంటూ ప్రధాన పూజారి చేసిన ఆరోపణలను రామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా మంగళవారం ఖండించారు. గర్భగుడిలో ఎలాంటి లీకేజీలు లేవని, అయితే విద్యుత్తు వైర్లు బిగించడానికి ఏర్పాటు చేసిన పైపు లైన్ల ద్వారా కొద్దిగా నీరు కిందకు వచ్చిందని తెలిపారు.