న్యూఢిల్లీ: లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఇవాళ చర్చ జరిగింది. ఆ చర్చలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తన ప్రసంగంలో హిందువులపై వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై అటాక్ చేసిన ఆయన.. భయం, ద్వేషం, అబద్దాలు వ్యాప్తి చేయడం హిందూ మతం కాదు అని రాహుల్ గాంధీ అన్నారు. అన్ని మతాలు ధైర్యం గురించి మాట్లాడుతాయని, ఇస్లాం, సిక్కు మతంలో భయంలేదన్నారు. రాహుల్ ఆ వ్యాఖ్యలు చేసిన సమయంలో సభలో గందరగోళం నెలకొన్నది. ఆ సమయంలో ప్రధాని మోదీ జోక్యం చేసుకున్నారు.
#WATCH | After PM Modi objects to his remarks, LoP Lok Sabha, Rahul Gandhi says, ” Modi, BJP, RSS not the entire Hindu community.” https://t.co/fw7bSSHb9H
— ANI (@ANI) July 1, 2024
సభలో ఉన్న మోదీ మాట్లాడుతూ.. యావత్ హిందూ సమాజం హింసాత్మకం అని ఆరోపణలు చేయడం తీవ్రమైన అంశమని అన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోదీ ఖండించారు. శివుడి ప్లకార్డులను రాహుల్ గాంధీ సభలో ప్రదర్శించడాన్ని స్పీకర్ ఓం బిర్లా వ్యతిరేకించారు. ప్రతిపక్షంలో ఉండడం పట్ల గర్వంగా, సంతోషంగా ఉందన్నారు. తమకు అధికారం కన్నా ముఖ్యమైంది ఒకటి ఉందని, అది సత్యం అని రాహుల్ తెలిపారు.
ప్రధాని జోక్యం చేసుకున్న తర్వాత రాహుల్ మాట్లాడుతూ.. మోదీ హిందూ సమాజం కాదు అని, బీజేపీ హిందూ సమాజం కాదు అని, ఆర్ఎస్ఎస్ హిందూ సమాజం కాదు అని అన్నారు. మరోసారి ప్రధాని జోక్యం చేసుకుని మాట్లాడారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం తనకు కొన్ని నేర్పించాయని, ప్రతిపక్ష నేత రాహుల్ చేసిన వ్యాఖ్యలను గంభీరంగా తీసుకోవాలని మోదీ అన్నారు.