న్యూఢిల్లీ, జూన్ 28: దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్-1 వద్ద పైకప్పు కుప్పకూలింది. శుక్రవారం తెల్లవారు జామున 5 – 5.30 గంటల మధ్య ఒక్కసారిగా పైకప్పు, ఇనుప పిల్లర్లు కూలిపోయాయి. దీంతో కింద ఉన్న పలు కార్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఢిల్లీలోని రోహిణి ప్రాంతానికి చెందిన రమేశ్ కుమార్(45) అనే క్యాబ్ డ్రైవర్ మరణించగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని సమీపంలోని దవాఖానలకు తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. ఢిల్లీ అగ్నిమాపక శాఖ, సీఐఎస్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలికి చేరుకొని శిథిలాల కింద చిక్కుకున్న ఒకరిని రక్షించాయి. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు ఘటనా స్థలిని పరిశీలించి, పరిస్థితిని సమీక్షించారు.
భారీ వర్షాల కారణంగా టెర్మినల్-1 పైకప్పు కూలిపోయిందని విమానయాన శాఖ పేర్కొన్నది. ఈ ఘటన వల్ల టెర్మినల్-1ని మూసివేస్తున్నట్టు తెలిపింది. కాగా, ఢిల్లీ ఎయిర్పోర్టులో మూడు టెర్మినళ్లు ఉన్నాయి. ఘటన జరిగిన టెర్మినల్-1 నుంచి ఇండిగో, స్పైస్జెట్ సంస్థలకు చెందిన దేశీయ విమాన సర్వీసులు నడుస్తాయి. ఈ ఘటన వల్ల టెర్మినల్-1లోనికి ప్రయాణికులు రాలేకపోతున్నారని, ఈ టెర్మినల్ నుంచి బయల్దేరాల్సిన పలు విమానాలను రద్దు చేస్తున్నట్టు ఈ రెండు విమానయాన సంస్థలు ప్రకటించాయి. కాగా, ఈ ఘటనపై విచారణకు విమానాశ్రయ యాజమాన్యం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. మరోవైపు ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు ఐపీసీ సెక్షన్ 304ఏ, 337ల కింద కేసు నమోదు చేశారు.
ఢిల్లీ విమానాశ్రయ ఘటనపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. పదేండ్ల మోదీ ప్రభుత్వ హయాంలో అవినీతి, నిర్లక్ష్యం వల్ల నాసిరకం మౌలిక సదుపాయాలు పేకమేడల్లా కూలిపోతున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. టెర్మినల్-1 విస్తరణ పనులు అసంపూర్తిగా ఉన్నప్పుడే ఎన్నికల్లో లబ్ధి కోసం ప్రధాని మోదీ హడావుడిగా ప్రారంభించారని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఓమర్ అబ్దుల్లా, తృణమూల్ కాంగ్రెస్ నేత సాకేత్ గోఖలే, కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఆరోపించారు. కాగా, ప్రతిపక్షాల విమర్శలను విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఖండించారు. ప్రధాని మోదీ ప్రారంభించింది మరోవైపున ఉందని, పైకప్పు కూలింది 2009లో ప్రారంభించిన పాత భవనానికి సంబంధించినదని ఆయన పేర్కొన్నారు.