లక్నో: ఉత్తరప్రదేశ్లో జరిగే ఉప ఎన్నికల్లో ఖాళీ అయిన అన్ని అసెంబ్లీ స్థానాల్లో (UP Assembly Bypolls) పోటీ చేస్తామని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ నేతృత్వంలోని ఆజాద్ సమాజ్ పార్టీ (ఏఎస్పీ) ప్రకటించాయి. దీంతో లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలువని బీఎస్పీ కలవరపడుతోంది. దళిత ఓటర్లు ఏఎస్పీకి మొగ్గడంపై ఆందోళన చెందుతోంది. ఉత్తరప్రదేశ్లో తొమ్మిది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు లోక్సభకు ఎన్నికయ్యారు. దీంతో 9 అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయి. క్రిమినల్ కేసులో కోర్టు శిక్ష విధించడంతో ఎమ్మెల్యే ఇర్ఫాన్ సోలంకిపై అనర్హత వేటు పడింది. దీంతో కాన్పూర్లోని సిసామావు సీటు కూడా ఖాళీ అయ్యింది. ఈ నేపథ్యంలో పది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి.
కాగా, పది అసెంబ్లీ స్థానాల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలువక నిరాశలో ఉన్న పార్టీకి ఉత్తేజం ఇచ్చేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు. గతానికి భిన్నంగా ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. అభ్యర్థుల జాబితాను పార్టీ కార్యాలయానికి పంపాలని సమన్వయకర్తలకు సూచించారు. అలాగే నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి ఉప ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించాలని పార్టీ కార్యకర్తలను కోరారు.
మరోవైపు బీఎస్పీ ఆశలపై మరోసారి నీళ్లు చల్లేందుకు ఆజాద్ సమాజ్ పార్టీ (ఏఎస్పీ) రంగంలోకి దిగింది.
10 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని ఏఎస్పీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ప్రకటించారు.
ఖైర్ (అలీగఢ్), మీరాపూర్ (ముజఫర్నగర్), కుందర్కి (మొరాదాబాద్), ఘజియాబాద్ సదర్ (ఘజియాబాద్) నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జ్లను నియమించినట్లు తెలిపారు. మిగతా స్థానాలకు కూడా ఇన్ఛార్జ్ల పేర్లను త్వరలో ప్రకటిస్తామని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో నగీనా సీటు గెలుచుకున్న ఆ పార్టీ దళిత ఓటర్ల బలంతో మరింతగా విస్తారించాలని భావిస్తున్నది.