BSNL | న్యూఢిల్లీ: ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ మరోసారి సైబర్ నేరగాళ్ల బారిన పడింది. దానికి సంబంధించిన డాటా పెద్దయెత్తున హ్యాకర్ల చేతికి చిక్కింది. దీనితో పాటు ఆసియాలోని మరో 10 టెలికం కంపెనీల డాటాను సైతం వారు చేజిక్కించుకున్నారు. బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల డాటాను చేజిక్కించుకున్న కైబర్ ఫాంటమ్ అన్న హ్యాకర్ డార్క్ వెబ్లో బెదిరింపులకు దిగాడు. ఈ డాటా బయటివారి చేతుల్లోకి వెళ్లకుండా ఉండాలంటే ముందు మీరే కొనుక్కోండని బీఎస్ఎన్ఎల్కు ఆఫర్ ఇస్తూ 24 గంటలు గడువిచ్చాడు. ఈ హ్యాకర్ బీఎస్ఎన్ఎల్కు చెందిన ఐఎంఎస్ఐ రికార్డులు, సిమ్ వివరాలు, హోమ్ లొకేషన్ రిజిస్టర్, డీపీ సెక్యూరిటీ కీ డాటా, లాగిన్ వివరాలు హ్యాక్ చేశాడు. కాగా, 2023లో సైతం బీఎస్ఎన్ఎల్కు చెందిన 29 లక్షల మంది వినియోగదార్ల డాటా లీక్ అయ్యింది.
గోల్డీ బ్రార్పై 10 లక్షల రివార్డు: ఎన్ఐఏ
న్యూఢిల్లీ: కెనడా కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాది గోల్డీ బ్రార్పై ఎన్ఐఏ రూ.10 లక్షల రివార్డు ప్రకటించింది. ఆయన గురించిన సమాచారం అందిస్తే బహుమతిగా ఇస్తామని తెలిపింది. దోపిడీ, కాల్పుల కేసులో నిందితుడైన గోల్డీ బ్రార్ సహచరుడైన గోల్డీ థిల్లాన్ ఆచూకీ కోసం సైతం 10 లక్షల రివార్డును ప్రకటించింది. ఈ ఇద్దరు నిందితులు ఈ ఏడాది మార్చి 8న చండీగఢ్లోని ఒక వ్యాపారవేత్తను దోపిడీ చేసే క్రమంలో ఆయన ఇంటిపై కాల్పులు జరిపిన కేసుల్లో నిందితులని ఎన్ఐఏ తెలిపింది. వీరి గురించి తెలిసిన వారు ఫోన్ నెంబర్ 011-24368800, వాట్సాప్, టెలిగ్రామ్ 7743002947కు సమాచారం అందించాలని, వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని చండీగఢ్ బ్రాంచ్ ఆఫీస్ ఒక ప్రకటనలో పేర్కొంది.
నాటో చీఫ్గా నెదర్లాండ్స్ ప్రధాని
న్యూఢిల్లీ: 30 దేశాలతో కూడిన నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) కొత్త చీఫ్గా నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రుట్టే బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు నాటో కూటమి బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కూటమిలో ప్రధాన దేశమైన అమెరికా ఆధ్వర్యంలో వాషింగ్టన్లో జరగనున్న ప్రధాన శిఖరాగ్ర సమావేశానికి ముందు అక్టోబర్ 1న ప్రస్తుతం సెక్రటరీ జనరల్గా ఉన్న జెన్స్ స్టోల్టెన్బర్గ్ స్థానంలో రుట్టే బాధ్యతలు చేపడతారని వెల్లడించింది.