High Court | ముంబై: మహారాష్ట్రలోని బద్లాపూర్లో పసిపిల్లలపై ఓ పాఠశాల స్వీపర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనను బాంబే హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. పిల్లలకు పాఠశాలలు సురక్షితం కాకపోతే.. ఇక విద్యాహక్కు గురించి మాట్లాడటంలో అర్థం లేదని పేర్కొన్నది. ఈ కేసులో పోలీసుల తీరును తీవ్రంగా తప్పుబట్టింది.
ప్రజాగ్రహం తీవ్ర స్థాయిలో వ్యక్తం కాకపోతే, అధికార యంత్రాంగం కదలడం లేదని దుయ్యబట్టింది. ఇద్దరు బాలికలపై లైంగిక దాడి ఘటన అమానుషమైనది మాత్రమే కాకుండా, అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొంది. బద్లాపూర్ పోలీసులు నిర్వహిస్తున్న ఒరిజినల్ కేస్ డైరీ, ఎఫ్ఐఆర్ నకలు, ఈ కేసుకు సంబంధించిన ఇతర పత్రాలను ఈ నెల 27న సమర్పించాలని సిట్ను ఆదేశించింది.
ముంబై సమీపంలోని బద్లాపూర్లోని ఓ పాఠశాలలో ఇద్దరు బాలికలపై లైంగిక దాడి జరిగినట్లు కేసు నమోదైన విషయం తెలిసిందే. 3-4 ఏళ్ల వయసుగల ఈ ఇద్దరిపైనా అదే పాఠశాలలో పని చేస్తున్న పురుష అటెండెంట్ లైంగిక దాడి చేసినట్లు తెలియడంతో పెద్ద ఎత్తున ప్రజాగ్రహం వ్యక్తమైంది. ఈ నెల 12, 13 తేదీల్లో ఈ దారుణం జరిగినప్పటికీ పోలీసులు ఈ నెల 16న కేసు నమోదు చేశారు.