రాంచీ: జార్ఖండ్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని మాజీ సీఎం హేమంత్ సోరెన్ (Hemant Soren) అన్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో దీని కోసం కృషి చేస్తానని శపథం చేశారు. దేశంలో సామాజిక నిర్మాణాన్ని నాశనం చేయడంలో బీజేపీకి నైపుణ్యం ఉందని విమర్శించారు. అందుకే లోక్సభ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పారని అన్నారు. మనీలాండరింగ్ కేసులో బెయిల్పై జైలు నుంచి విడుదలైన హేమంత్ సోరెన్, శనివారం రాంచీలో జేఎంఎం కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీజేపీపై ఆయన మండిపడ్డారు.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని బీజేపీ పగటి కలలు కంటోందని హేమంత్ సోరెన్ ఎద్దేవా చేశారు. ‘మాపై కుట్ర పన్నిన వారికి తగిన సమాధానం చెబుతాం. బీజేపీ శవపేటికకు చివరి మేకు వేసే సమయం వచ్చింది. జార్ఖండ్లో కమలం పార్టీ తుడిచిపెట్టుకుపోతుంది’ అని అన్నారు.
కాగా, జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికలు ముందుగానే జరుగవచ్చని హేమంత్ సోరెన్ అంచనా వేశారు.
‘రాష్ట్రంలో (అసెంబ్లీ) ఎన్నికలు ముందుగానే జరగవచ్చని నాకు సమాచారం అందింది. మేం సిద్ధంగా ఉన్నాం’ అని పార్టీ కార్యకర్తలనుద్దేశించి అన్నారు.
మరోవైపు మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ గురించి హేమంత్ సోరెన్ మాట్లాడారు. ‘నిజాన్ని ఎవరూ దాచలేరు. త్వరలో లేదా ఆ తర్వాతైనా అది బయటకు వస్తుంది’ అని తెలిపారు. మీకు నాయకత్వాన్ని అందించడానికి మరోసారి మీ ముందుకు వచ్చానని అన్నారు.