Waterlogging : భారీ వర్షాలతో దేశ రాజధాని ఢిల్లీ జలమయమైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగర రోడ్లు నీటితో నిండిపోయాయి. వర్షాలతో ఢిల్లీ తల్లడిల్లడంపై బీజేపీ ఎంపీ కమల్జీ షెహ్రవత్ ఆప్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. తప్పుడు ఆరోపణలు గుప్పించడంలో బిజీగా మారిన ఆప్ ప్రభుత్వమే ఈ పరిస్ధితికి కారణమని ఆరోపించారు. మరోవైపు దేశ రాజధాని రోడ్లు జలమయం కావడంపై బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ స్పందిస్తూ కాలువలను శుభ్రం చేయాలని తాము గత రెండు నెలలుగా చెబుతున్నా ఢిల్లీ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని దుయ్యబట్టారు.
ప్రభుత్వ నిర్వాకంతో కాలువలన్నీ మూసుకుపోయాయని, భారీ వర్షాలతో వరద ముంచెత్తిందని ఆరోపించారు. ఆప్ వైఫల్యానికి ఇది పరాకాష్టని విమర్శించారు. కాగా, దేశ రాజధాని ఢిల్లీలో కురిసిన భారీ వర్షాలు పలు ప్రాంతాలను ముంచెత్తాయి. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో రోడ్డుపై నిండిన నీటిలో బీజేపీ నేత బోటు నడిపారు. (BJP Councillor Rows Boat) ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వంపై మండిపడ్డారు.
భారీ వర్షాలకు తూర్పు ఢిల్లీలోని వినోద్ నగర్ ప్రాంతం జలమయమైంది. దీంతో స్థానికంగా నివసించే బీజేపీ కౌన్సిలర్ రవీందర్ సింగ్ నేగి వినూత్నంగా నిరసన తెలిపారు. గాలి బోటును వర్షం నీటిలో నడిపారు. ఆప్ ప్రభుత్వంపై రవీందర్ సింగ్ నేగి మండిపడ్డారు. ఢిల్లీలో అన్ని పీడబ్ల్యూడీ కాలువలు పొంగిపొర్లుతున్నాయని విమర్శించారు. మౌలిక సదుపాయాలు కుప్పకూలాయనడానికి ఇది నిదర్శనమని ఆరోపించారు. ‘వర్షాకాలం ముందు కాలువలను శుభ్రం చేయలేదు. దీంతో వర్షం వల్ల నీటి ముంపునకు దారితీసింది. వినోద్ నగర్ మునిగిపోయింది’ అని మీడియాతో అన్నారు.
అయితే బీజేపీ కౌన్సిలర్ రవీందర్ సింగ్ నేగి వర్షం నీటితో నిండిన రోడ్డులో బోటింగ్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.భారీ వర్షం కారణంగా ఢిల్లీ తడిసి ముద్దైంది. రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆజాద్ మార్కెట్ అండర్ పాస్ వద్ద పలు లారీలు నీట మునిగాయి. నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాల్లో కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. దీంతో ఉదయం కార్యాలయాలకు వెళ్లే వారు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
Read More :
Congress MP | రాజ్యసభలో కళ్లుతిరిగి పడిపోయిన కాంగ్రెస్ ఎంపీ.. ఆస్పత్రికి తరలింపు.. Video