న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కీలకమైన న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) సభ్యురాలిగా బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్ను (Bansuri Swaraj) నియమించారు. జూలై 3న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దివంగత బీజేపీ అగ్ర నాయకురాలు సుష్మా స్వరాజ్ కుమార్తె అయిన బన్సూరి స్వరాజ్ లోక్సభ ఎన్నికల్లో న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలో కీలకమైన ఎన్డీఎంసీలో సభ్యురాలిగా కేంద్ర ప్రభుత్వం ఆమెను నియమించింది.
కాగా, ఢిల్లీ మున్సిపాలిటీ సేవలు, పరిపాలనలో ఎన్డీఎంసీ సభ్యులు కీలక పాత్ర పోషిస్తారు. అర్బన్ ప్లానింగ్, భూ వినియోగం, జోనల్ నిబంధనలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పట్టణ ప్రణాళికకు సంబంధించిన విధానాల రూపకల్పన, అమలుకు సభ్యులు సహకరిస్తారు.
మరోవైపు ఆరోగ్య సదుపాయాలు, స్కూల్స్, నీటి సరఫరా, విద్యుత్, మురుగునీరు, వ్యర్థాల నిర్వహణ వంటి ప్రజా సేవల అమలు, నిర్వహణను పర్యవేక్షించే బాధ్యతలు కూడా ఎన్డీఎంసీ సభ్యులు నిర్వహిస్తారు. బడ్జెటింగ్ ప్రక్రియలో పాల్గొనడం, వ్యయాలను ఆమోదించడం, కౌన్సిల్ కార్యకలాపాలలో ఆర్థిక క్రమశిక్షణ, పౌరులు, కౌన్సిల్ మధ్య అనుసంధానకర్తగా పనిచేయడం, ప్రజా ఫిర్యాదులను పరిష్కరించడం వంటి కీలక విధులు కూడా నిర్వర్తిస్తారు.