కోల్కతా: పశ్చిమ బెంగాల్లో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకున్నారని ఆరోపిస్తూ ఓ జంటను కొంతమంది విచక్షణారహితంగా కొట్టారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక నాయకుడు నడిరోడ్డుపై వారికి బహిరంగ శిక్ష విధించాడు. ఇద్దర్నీ రోడ్డుపై పడేసి చావబాదాడు. మహిళను జుట్టు పట్టుకొని కొట్టి, కిందపడేసి తన్నాడు. ఎంత వేడుకున్నా ఆ జంటను వదల్లేదు. ఈ అమానవీయ ఘటన ఉత్తర దినాజ్పూర్ జిల్లా చోప్రా పట్టణంలో చోటుచేసుకుంది.
జనం గుమికూడి చూస్తుండటం, దాడిని ఆపే ప్రయత్నం చేయకపోవటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఇంత జరుగుతున్నా పోలీసులు ఏం చేస్తున్నారు? రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా? అంటూ ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. చోప్రా పట్టణంలో అధికారపార్టీకి చెందిన స్థానిక నాయకుడే దాడికి తెగబడ్డాడని, స్థానికంగా తలెత్తే వివాదాల్లో తీర్పులు చెబుతూ.. నడిరోడ్డుపై శిక్షలు అమలుజేస్తున్నాడని బీజేపీ, సీపీఎం ఆరోపించాయి.
నిందితుడు చోప్రా ఎమ్మెల్యే రెహమాన్ ముఖ్య అనుచరుడు తేజ్ముల్గా బీజేపీ ఐటీ విభాగం ‘ఎక్స్’లో పేర్కొన్నది. మమత సర్కార్ పాలనలో ‘బుల్డోజర్ జస్టిస్’ అమలైందని సీపీఎం నాయకుడు ఎండీ సలీం అన్నారు. బెంగాల్లో సామాన్యులపై దాడులు కొనసాగుతున్నాయని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దాడి ఘటనపై ఇస్లామ్పూర్ ఎస్పీ జాబీ థామస్ స్పందించారు. ఘటనకు బాధ్యులైన వారిని అరెస్టు చేయనున్నట్టు చెప్పారు. కాగా, దాడి ఘటనను తృణమూల్ ఖండించింది. నిందితుడు ఏ పార్టీకి చెందినా వదిలిపెట్టేది లేదని స్పష్టంచేసింది.