BJP | న్యూఢిల్లీ, జూన్ 28: దేశంలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్నామని గొప్పగా ప్రచారం చేసుకుంటున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు వాటి నాణ్యతపై మాత్రం దృష్టి పెట్టడం లేదు. ఘనంగా చేస్తున్న ప్రారంభోత్సవాల హడావుడి మరవకముందే పనుల్లో డొల్లతనం బయటపడుతున్నది. ఇటీవల వరుసగా జరుగుతున్న ఘటనలు బీజేపీ హయాంలో జరుగుతున్న నిర్మాణాల్లో లోపాలను ప్రస్ఫుటం చేస్తున్నాయి.
జనవరి 22న ప్రధాని మోదీ అట్టహాసంగా అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించారు. చిన్నపాటి వర్షాలకే ఆలయ పైకప్పు నుంచి నీరు లీక్ అవుతున్నది. ఆలయ పరిసరాల్లోనూ సమస్యలు బయటపడ్డాయి. వర్షాలకు ఆలయ పరిసరాలు, రోడ్లు నీట మునిగి స్థానికులు, భక్తులు అవస్థలు పడుతున్నారు. ఆలయ భద్రత చూసే సైనికుల శిబిరాల్లోకి కూడా నీరు చేరింది.
మహారాష్ట్రలో సముద్రంపై నిర్మించిన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ను జనవరి 12న ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా ప్రారంభించారు. దేశంలోనే సముద్రం మీద నిర్మించిన పొడవైన ఈ వంతెనకు అటల్సేతు అని పేరు పెట్టారు. రూ.17,840 కోట్ల వ్యయంతో మహారాష్ట్రలోని ఎన్డీయే ప్రభుత్వం దీనిని నిర్మించింది. అయితే, ప్రారంభించి ఐదు నెలలు గడవకముందే బ్రిడ్జిపై రోడ్డుకు పగుళ్లు వచ్చాయి. కాగా, ప్రధాన బ్రిడ్జీకి పగుళ్లు రాలేదని, పక్కన సమాంతరంగా నిర్మించిన సర్వీస్ రోడ్డుపై వచ్చినట్టు మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పుకున్నది.
శుక్రవారం ఢిల్లీ ఎయిర్పోర్టులోని టెర్మినల్-1 వద్ద పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా, ఆరుగురికి గాయాలయ్యాయి. గురువారం బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఉన్న దుమ్నా ఎయిర్పోర్టులోనూ ఇదేరకంగా పైకప్పు కూలి పార్క్ చేసిన కారుపై పడింది.
ఢిల్లీలో రూ.777 కోట్లతో 1.3 కిలోమీటర్ల పొడవైన ప్రగతి మైదాన్ టన్నెల్ను నిర్మించారు. 2022 జూన్లో ప్రధాని మోదీ ఈ టన్నెల్ను ఘనంగా ప్రారంభించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ టన్నెల్కు పగుళ్లు ఏర్పడ్డాయి. ఇక, శుక్రవారం కురిసిన వర్షానికి ఈ టన్నెల్ పూర్తిగా నీట మునిగింది.
ఎన్డీయే పాలిత బీహార్లో వరుసగా బ్రిడ్జిలు కూలుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత తొమ్మిది రోజుల్లో రాష్ట్రంలో ఐదు వంతెనలు కూలిపోయాయి. శుక్రవారం మధుబని ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న వంతెన కూలింది. గురువారం కిషన్బాగ్ జిల్లాలో, జూన్ 23న తూర్పు చంపారన్ జిల్లాలో, 22న సివన్లో, 19న అరారియాలో ఇలాగే వంతెనలు కూలిపోయాయి.