NEET | లక్నో, జూన్ 27: నీట్-యూజీ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయిన వివాదం దేశవ్యాప్తంగా ఆందోళనలకు దారితీస్తున్న నేపథ్యంలో ఓ ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బీజేపీ మిత్రపక్షమైన సుహల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్బీఎస్పీ)కి చెందిన జఖానియా ఎమ్మెల్యే బేడీ రాం అలియాస్ త్రివేణి రాం మాట్లాడుతుండగా రహస్యంగా రికార్డు చేసిన వీడియో వైరల్గా మారింది. తాను పేపర్ లీక్లకు పాల్పడినట్టు అందులో ఆయన అంగీకరించారు. డబ్బులు తీసుకొని వేర్వేరు రాష్ర్టాల్లో ఎంతోమందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేలా చేశానని బేడీ రాం చెప్తున్నట్టుగా ఈ వీడియోలో ఉంది.
తనకు చాలా రాష్ర్టాల్లో సంబంధాలు ఉన్నాయని, చిన్న చిన్న కేసులు తాను తీసుకోనని, ఎక్కువ మంది ఉండే పెద్ద వ్యవహారాలు అయితేనే తాను ఒప్పుకుంటానని బేడీ రాం చెప్పుకొచ్చాడు. తనకు డబ్బులు ఇస్తే కచ్చితంగా అభ్యర్థిని పాస్ చేయిస్తానని, పరీక్ష రద్దు అయితే మాత్రం తనకు సంబంధం లేదని చెప్పాడు. బేడీ రాంకు డబ్బులిచ్చినా ఉద్యోగం రాకపోవడంతో తన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒక యువకుడు అడుగుతున్న క్రమంలో ఈ చర్చ జరిగినట్టు తెలుస్తున్నది. ఆ యువకుడే బేడీ రాం మాటలను రికార్డు చేశారని స్థానిక మీడియా భావిస్తున్నది.
బేడీ రాం వ్యాఖ్యలపై కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ తీవ్రంగా స్పందించాయి. బేడీ రాంకు బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. పేపర్ లీక్లో తన పాత్ర ఉందని ఒప్పుకున్న తర్వాత కూడా బేడీ రాం ఇంకా ఎన్డీయేలో ఎలా ఉన్నాడని కాంగ్రెస్ ప్రశ్నించింది. పిల్లల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్న బీజేపీ మిత్రపక్ష నాయకుల నైతిక దిగజారుడుతనానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ప్రశ్నించారు. ఇది సిగ్గుచేటు అని, వెంటనే బేడీ రాంను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీకి ఓటు వేసిన తల్లిదండ్రులు ఈరోజు పశ్చాత్తాపం చెందుతున్నారని, భవిష్యత్తులో బీజేపీకి ఓటు వేయబోమని శపథం చేస్తున్నారని అన్నారు.
బేడీ రాం చాలాకాలంగా పేపర్ లీక్ ముఠాను నడిపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఎన్నికల అఫిడవిట్లో తొమ్మిది కేసులు నమోదై ఉండగా వీటిల్లో ఎనిమిది కేసులు పేపర్ లీక్ ఘటనలకు సంబంధించినవేనని తెలుస్తున్నది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో రైల్వే, పోలీసు నియామక పరీక్షల ప్రశ్నాపత్రాలను లీక్ చేశాడని అతడిపై కేసులు నమోదయ్యాయి. పలు కేసుల్లో ఆయన జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. 2017, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో యూపీలోని ఘాజీపూర్ జిల్లా జఖానియా నియోజకవర్గం నుంచి ఎస్బీఎస్పీ తరపున ఎమ్మెల్యేగా గెలిచాడు.