Karnataka | బెంగళూరు, జూన్ 26: కర్ణాటక రాజధాని బెంగళూరు నగర అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తున్నది. ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలను కల్పించడంలోనూ ఆశ్రద్ధ వహిస్తున్నది. ప్రభుత్వ తీరుతో విసిగిపోతున్న ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సమస్యలను పరిష్కరించుకుంటూ ప్రభుత్వ అసమర్థత పట్ల నిరసన తెలిపారు.
నగరంలోని బలగేరే ప్రాంతంలో రోడ్లు గుంతలమయంగా మారాయని, చెత్త ఊడ్చే వారు కూడా లేరని స్థానికులు బెంగళూరు మహానగరపాలక సంస్థ(బీబీఎంపీ)కి అనేక సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకలోదు.దీంతో విసిగిపోయిన విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, యువత స్వయంగా రంగంలోకి దిగారు. రోడ్లపై గుంతలు పూడ్చి, శుభ్రం చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. రోడ్ల సమస్యపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలని అధికారులను ఆదేశించారు.
న్యూఢిల్లీ: రోడ్లు సరిగా లేకుంటే టోల్ చార్జీలు వసూలు చేయొద్దని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ హైవే సంస్థలకు సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 5 వేల కిలోమీటర్లకు పైగా అమలు చేయనున్న ఉపగ్రహ ఆధారిత టోలింగ్పై బుధవారం నిర్వహించిన వర్క్షాప్లో గడ్కరీ మాట్లాడారు.
నాణ్యమైన సేవలు అందించనప్పుడు టోల్ వసూలు చేయకూడదని స్పష్టం చేశారు. మన ప్రయోజనాల కోసం టోల్ను ప్రారంభించి వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు తొందరపడుతున్నామని పేర్కొన్నారు. వినియోగదారులకు నాణ్యమైన రోడ్లను అందించినప్పుడు మాత్రమే రుసుము వసూలు చేయాలని తెలిపారు. బాగా లేని రోడ్లకు కూడా టోల్ వసూలు చేస్తే వ్యతిరేకత తప్పదని గడ్కరీ పేర్కొన్నారు.