Bandh | న్యూఢిల్లీ: పేపర్ లీకేజీలను నిరసిస్తూ జూలై 4న దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ తదితర వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. బంద్కు విద్యా సంస్థల యాజమాన్యాలు సహకరించాలని కోరాయి. నీట్, నెట్ పేపర్ లీకేజీలకు నిరసనగా దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఆందోళనలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. పరీక్షల నిర్వహణలో విఫలమైన ఎన్టీఏను రద్దు చేయాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇవే డిమాండ్లతో జూలై 4న బంద్కు పిలుపునిచ్చాయి. మరోవైపు నీట్ అక్రమాలను నిరసిస్తూ మంగళవారం విద్యార్థి సంఘాలు పార్లమెంట్ మార్చ్ చేపట్టనున్నాయి.జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరవధిక నిరసనలు సోమవారం 6వ రోజుకు చేరుకున్నాయి.
యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ, జూలై 1: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష-2024 ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. మెయిన్స్ పరీక్షకు క్వాలిఫై అయిన అభ్యర్థుల రోల్ నంబర్లతో జాబితాను యూపీఎస్సీ విడుదల చేసింది. జూన్ 16న ఈ పరీక్ష నిర్వహించారు. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్షల ప్రక్రియ పూర్తయి తుది ఫలితాలు వచ్చాక, అభ్యర్థుల మార్కులు, కటాఫ్ మార్కులు, ఆన్సర్ కీలను యూపీఎస్సీ వెబ్సైట్లో అప్లోడ్ చేయనున్నారు.
ఓఎంఆర్ మ్యానిపులేషన్పై విచారణ వాయిదా
న్యూఢిల్లీ: నీట్-యూజీలో ఓఎంఆర్ షీట్ మ్యానిపులేషన్ జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణను సుప్రీంకోర్టు సోమవారం రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ పరీక్ష రాసిన ఓ విద్యార్థి ఈ పిటిషన్ను దాఖలు చేశారు. పిటిషనర్ రాసిన ఓఎంఆర్ షీటును మార్చేశారని ఆయన తరపు న్యాయవాది ఆరోపించారు. దీనిపై వెకేషన్ బెంచ్ స్పందిస్తూ, జూన్ 23న జరిగిన రీటెస్ట్కు హాజరయ్యేందుకు పిటిషనర్ అనుమతి కోరారని తెలిపింది. ఆ పరీక్ష అయిపోయిందని చెప్పింది. దీనిపై రెండు వారాల తర్వాత విచారణ జరపాలని ఎన్టీఎ న్యాయవాది కోరారు.