Ashwini Vaishnaw : పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రసంగంపై కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత అంటే ఓ బాధ్యతాయుత పదవి అని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ విపక్ష నేతగా తొలిసారి ఈ బాధ్యతలను చేపట్టారని, కానీ ఇవాళ ఆయన బాధ్యతారాహిత్య ప్రకటన చేశారని అన్నారు. అమర వీరులకు ఎలాంటి పరిహారం చెల్లించడం లేదని ఆయన అసత్యాలు వల్లె వేశారని అన్నారు. ఇంతకంటే మరో పెద్ద అబద్ధం ఏదీ ఉండదని పేర్కొన్నారు.
అమరవీరులకు రూ. కోటి పరిహారం అందిస్తున్నామని రక్షణ మంత్రి స్వయంగా సభలో వివరణ ఇచ్చారని గుర్తుచేశారు. వాస్తవాల ఆధారంగా రాహుల్ గాంధీ మాట్లాడాలని మంత్రి వైష్ణవ్ హితవు పలికారు. సైన్యంపై సందేహాలు లేవనెత్తడం కాంగ్రెస్కు ఇదే తొలిసారి కాదని, సైన్యంపై కాంగ్రెస్ ఎప్పుడూ ఇలాంటి ప్రశ్నలు లేవనెత్తి దేశాన్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు.
మరోవైపు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభ్యంతరం తెలిపారు. హిందువులు అని చెప్పుకునే వారు హింస గురించి మాట్లాడతారని, హింసకు పాల్పడతారని విపక్ష నేత స్పష్టంగా పేర్కొన్నారని చెప్పారు. కోట్లాది మంది ప్రజలు తాము హిందువులమని గర్వంగా చెప్పుకుంటారనే విషయం రాహుల్కు తెలియదని వ్యాఖ్యానించారు.
ఏ మతాన్ని హింసతో ముడిపెట్టడం తప్పని హితవు పలికారు. రాహుల్ హిందువులను అవమానించిందుకు క్షమాపణలు చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు. ఇక విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్సభ ప్రసంగంలో ఎక్కడా హిందువులను అవమానించలేదని ఆ పార్టీ నేత ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. తాను బీజేపీతో పాటు ఆ పార్టీ నేతల తీరు గురించే మాట్లాడానని రాహుల్ స్పష్టంగా చెప్పారని ఆమె పేర్కొన్నారు.
Read More :
KTR | కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ విజృంభిస్తాం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు