Arvind Kejriwal | మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ కోర్టు మూడురోజుల కస్టడీకి ఇచ్చింది. మద్యం పాలసీ కేసులో సీబీఐ ఆయనను బుధవారం తిహార్ జైలులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కోర్టులో ఆయనను హాజరుపరిచిన సీబీఐ.. ఐదురోజుల కస్టడీకి కోరింది. అయితే, కోర్టు మూడురోజులు కస్టడీకి అనుమతించింది. ఆయనను 29న సాయంత్రం 7గంటల్లోగా కోర్టులో హాజరుపరుచాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. కోర్టులో విచారణ సమయంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ మనీష్ సిసోడియాపై తాను వాంగ్మూలం ఇచ్చానని సీబీఐ చెబుతోందని.. ఇందులో వాస్తవం లేదన్నారు.
మనీష్ సిసోడియా నిర్దోషి అని.. ఆమ్ ఆద్మీ పార్టీ సైతం ఎలాంటి తప్పుచేయలేదని.. తాను సైతం నిర్దోషినేనన్నారు. కేసు విచారణ సమయంలో ఆయన స్వయంగా నిల్చొని మాట్లాడారు. మనీష్ సిసోడియాపై వాంగ్మూలం ఇచ్చానని మీడియాకు సీబీఐ చెబుతుందంటో అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను ఎలాంటి ప్రకటన ఇవ్వలేదన్నారు. తాను ఇప్పుడే అరెస్టు చేశారని.. రాబోయే మూడు నాలుగు రోజులు ఇవే చెబుతారని.. ఈ విషయాన్ని మీడియాలో పెట్టి పరువు తీస్తున్నారో కూడా రికార్డుల్లోకి తీసుకోవాలన్నారు. అయితే, ఆరోపణలను సీబీఐ ఖండించింది.