Arvind Kejriwal | ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఢిల్లీ హైకోర్టు తలుపుతట్టారు. ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ తనను అరెస్టు చేసి రిమాండ్ చేయడాన్ని ఆయన సవాల్ చేశారు. తిహార్ జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ను జూన్ 21న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచి ఐదురోజులు కస్టడీకి కోరింది. కోర్టు మూడురోజుల కస్టడీకి ఇచ్చింది. మళ్లీ జూన్ 29న ఆయనను సీబీఐ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరుచగా.. కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ప్రస్తుతం ఆయన కస్టడీలో జైలులో తిహార్ జైలులో ఉన్నారు. ఈ క్రమంలో కేజ్రీవాల్ సీబీఐ అరెస్టును సవాల్ చేశారు.
మద్యం పాలసీ కేసులో మార్చిలో ఆయనను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఢిల్లీలోని స్పెషల్ కోర్టు ఆయనకు రెగ్యులర్ బెయిల్ను ఇచ్చింది. బెయిల్పై ఈడీ హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు కేజ్రీవాల్ బెయిల్పై మధ్యంతర స్టే విధించింది. ఆ తర్వాత ఆయనను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మరో వైపు కేజ్రీవాల్ అరెస్టుపై ఆమ్ ఆద్మీ మండిపడింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకే ఆయనను సీబీఐ అరెస్టు చేసిందని ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. కేజ్రీవాల్కు వ్యతిరేకంగా ఈడీ వద్ద ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని కోర్టు ఉత్తర్వులు పేర్కొందన్నారు. కేసులో ఆరోపించిన డబ్బులను ఇప్పటి వరకు రికవరీ చేయలేదని గుర్తు చేశారు.