Arun Govil : పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రసంగంపై బీజేపీ ఎంపీ అరుణ్ గోవిల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈరోజు రాహుల్ గాంధీ అలా మాట్లాడాల్సింది కాదని అన్నారు. హిందువులందరికీ రాహుల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హిందువులుగా చెప్పుకునే వారు హింస గురించి మాట్లాడతారు, హింసకు పాల్పడతారని రాహుల్ అనడం ఆక్షేపించదగినదని ఆయన పేర్కొన్నారు.
రాహుల్ సోమవారం లోక్సభలో డ్రామా సృష్టించాలని అనుకున్నారని, కానీ అది ఎలా చేయాలో ఆయనకు తెలియలేదని ఎద్దేవా చేశారు. డ్రామా అంటే కంటెంట్ను అర్ధం చేసుకోవడం కీలకమని చెప్పారు. రాహుల్ ఎదగలేదని, ఆయన ఇంకా పరిణితి చెందాల్సి ఉందని అరుణ్ గోవిల్ వ్యాఖ్యానించారు. ఇలాంటి విపక్ష నేతను చూడటం చికాకుగా ఉందని పేర్కొన్నారు.
మరోవైపు లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభ్యంతరం తెలిపారు. హిందువులు అని చెప్పుకునే వారు హింస గురించి మాట్లాడతారని, హింసకు పాల్పడతారని విపక్ష నేత స్పష్టంగా పేర్కొన్నారని చెప్పారు. కోట్లాది మంది ప్రజలు తాము హిందువులమని గర్వంగా చెప్పుకుంటారనే విషయం రాహుల్కు తెలియదని వ్యాఖ్యానించారు.
ఏ మతాన్ని హింసతో ముడిపెట్టడం తప్పని హితవు పలికారు. రాహుల్ హిందువులను అవమానించిందుకు క్షమాపణలు చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు. ఇక విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్సభ ప్రసంగంలో ఎక్కడా హిందువులను అవమానించలేదని ఆ పార్టీ నేత ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. తాను బీజేపీతో పాటు ఆ పార్టీ నేతల తీరు గురించే మాట్లాడానని రాహుల్ స్పష్టంగా చెప్పారని ఆమె పేర్కొన్నారు.
Read More :
KTR | కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ విజృంభిస్తాం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు