NEET | న్యూఢిల్లీ, జూన్ 22: నీట్-యూజీ, యూజీసీ-నెట్ ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలతో పరీక్షల వ్యవస్థపై అనుమానాలు పెరుగుతున్న వేళ కేంద్రం దిద్దుబాటు చర్యలకు దిగింది. పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచేందుకు, అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు తీసుకోవాల్సిన చర్యల కోసం ఒక ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని నియమించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ కమిటీకి ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కే రాధాకృష్ణన్ నేతృత్వం వహించనున్నారు. ఇందులో సభ్యులుగా ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణ్దీప్ గులేరియా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ బీజే రావు, ఐఐటీ మద్రాస్ సివిల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ రామమూర్తి, పీపుల్ స్ట్రాంగ్ సంస్థ సహ వ్యవస్థాపకుడు, కర్మయోగి భారత్ సంస్థ బోర్డు సభ్యుడు పంకజ్ బన్సల్, ఐఐటీ ఢిల్లీ విద్యార్థి వ్యవహారాల డీన్ ప్రొఫెసర్ ఆదిత్య మిట్టల్ను కేంద్ర విద్యా శాఖ నియమించింది.
విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి గోవింద్ జైస్వాల్ ఈ కమిటీకి సభ్య కార్యదర్శిగా కొనసాగుతారు. ఈ కమిటీ ప్రస్తుతం ఉన్న పరీక్షల ప్రక్రియను పూర్తిగా అధ్యయనం చేసి, పరీక్షల వ్యవస్థను పటిష్ఠం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రానికి రెండు నెలల్లో ఒక నివేదిక సమర్పించనుంది. ఎన్టీఏ పనితీరు మెరుగుపరిచేందుకు సైతం సూచనలు చేయనుంది. కాగా, నిపుణుల కమిటీ ఏర్పాటును యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ స్వాగతించారు. ఈ కమిటీ సిఫార్సు చేసే సంస్కరణల ద్వారా జాతీయ ప్రవేశ పరీక్షల వ్యవస్థ పటిష్ఠం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
నీట్లో గ్రేస్ మార్కులు తొలగించిన 1563 మంది విద్యార్థులకు ఆదివారం మరోసారి పరీక్షను నిర్వహించనున్నారు. మొదటిసారి పరీక్షలో వీరికి పూర్తిగా పరీక్షా సమయం ఇవ్వనందుకుగానూ గ్రేస్ మార్కులు కలుపుతూ ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది. ఇది వివాదం కావడంతో గ్రేస్ మార్కులు తొలగించి మళ్లీ పరీక్ష నిర్వహిస్తున్నది.
ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్-యూజీ 24 పరీక్ష పేపర్ లీకేజీలో ప్రధాన నిందితుడిగా సంజీవ్ ముఖియా పేరు బయటకు రావడంతో అతనెవరు అన్న ఆసక్తి అందరిలో ఏర్పడింది. బీహార్లోని నలందా కాలేజీలో టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న సంజీవ్ ముఖియా అంతకుముందు జరిగిన బీహార్ టీచర్స్ రిక్రూట్మెంట్ పరీక్ష పేపర్ లీకేజీ కేసులో కూడా నిందితుడు. తొలుత సాబౌర్ అగ్రికల్చర్ కాలేజీలో పనిచేసిన సంజయ్ను ఉత్తరాఖండ్ పోలీసులు 2016లో ఒక పేపర్ లీక్ కేసులో అరెస్ట్ చేయడంతో అతడిని నూర్సరైకి బదిలీ చేశారు. సంజీవ్ కుమారుడు డాక్టర్ శివకుమార్ బీహార్ పరీక్ష పేపర్ లీక్ కేసులో ప్రస్తుతం జైలులో ఉన్నాడు.
పరీక్ష పేపర్ల లీకేజీలో కరుడుగట్టిన ముఖియా సాల్వర్ గ్యాంగ్ స్థాపనలో వీరిద్దరూ భాగస్వాములేనని బీహార్ పోలీసులు తెలిపారు. నీట్ పేపర్ లీక్లో ఆయన పేరు బయటకు రావడంతో మే 6 నుంచి సంజీవ్ పరారీలో ఉన్నాడు. అయితే అతను ఒక లాయర్ ద్వారా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు పోలీస్ వర్గాలు వెల్లడించాయి. ఒక కీలక వ్యక్తి ద్వారా నీట్ పేపర్ను అందుకున్న సంజీవ్ దానిని పలువురు విద్యార్థులకు లక్షలాది రూపాయలకు అమ్మాడు. వారందరినీ పరీక్షకు దగ్గరుండి ప్రిపేర్ చేయించాడు. ఈ విషయాన్ని అరెస్టయిన విద్యార్థులు ఇప్పటికే పోలీసులకు వెల్లడించారు. ఒక్కో విద్యార్థి నుంచి 30 నుంచి 50 లక్షలు వసూలు చేశారు. విద్యార్థులను పాట్నాలోని చిన్నచిన్న లాడ్జీలలో ఉంచి వారిచేత జవాబులు బట్టీ పట్టించాడు.
వాస్తవానికి సంజయ్ పేరు ముఖియా కాదు. అతని అసలు పేరు సంజీవ్ సింగ్. అయితే అతని భార్య మమతా దేవి ముఖియా పంచాయతీ చీఫ్గా ఎన్నిక కావడంతో సంజీవ్ సింగ్ను అందరూ ముఖియాగా పిలవడం ప్రారంభించారు. అయితే 2020 బీహార్ ఎన్నికల్లో హర్నోత్ నుంచి లోక్జన్ శక్తి పార్టీ నుంచి పోటీ చేసిన ఆమె ఓడిపోయారు. కాగా, సంజీవ్ సింగ్ తొలుత నీట్ పేపర్ను రాఖీ అనే వ్యక్తికి అప్పగించాడని పోలీస్ వర్గాలు తెలిపాయి. పలు పోటీ పరీక్షల పేపర్ల లీకేజీ కేసుల్లో సంజయ్ అనుమానితుడు. ఆ కేసుల్లో అతను జైలుకు కూడా వెళ్లాడు. వృత్తిరీత్యా డాక్టరైన అతని కుమారుడు శివకుమార్ కూడా పేపర్ లీకేజీలో ఆరితేరిన వాడు. బీహార్ టీచర్ రిక్రూట్మెంట్ పరీక్ష పేపర్ లీకేజీ కేసులో అతను ప్రస్తుతం జైలులో ఉన్నాడు.
నీట్ జరిగిన మే 5న లీకేజీ గురించి ఒక ఫోన్ కాల్ ద్వారా సమాచారం అందినట్టు బీహార్ పోలీస్ అధికారులు తెలిపారు. జార్ఖండ్ కేంద్రంగా ఉన్న సెంట్రల్ ఏజెన్సీ నుంచి వచ్చిన ఆ కాల్లో నీట్ పేపర్ లీకేజీలో ఏ గ్యాంగ్ పాల్గొన్నది, వారు వాడిన కారు, ఇతర వివరాలన్నీ అందజేసి, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారన్నారు. దాంతో తాము వెంటనే ఆ కారును స్వాధీనం చేసుకున్నామని, ముఠాకు చెందిన పులువురిని అదుపులోకి తీసుకున్నామన్నారు.
నీట్-యూజీ పేపర్ లీక్ కేసులో మరికొందరు అరెస్టయ్యారు. ఈ వ్యవహారంలో కీలక నిందితుడిగా భావిస్తున్న రవి అత్రిని యూపీ స్పెషల్ టాస్క్ పోర్స్ అరెస్టు చేసింది. బీహార్లో నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి పలువురు నిందితులు, విద్యార్థులు అరెస్టు అయినప్పటికీ వీరికి పేపర్ ఎక్కడి నుంచి లీక్ అయ్యిందనే విషయం మాత్రం తేలలేదు. అయితే, వీరిని విచారిస్తున్న సందర్భంగా రవి అత్రితో ఉన్న సంబంధాలు వెలుగులోకి వచ్చాయని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే రవిని అరెస్టు చేశారు. గ్రేటర్ నోయిడా సమీపంలోని నీంక అనే గ్రామానికి చెందిన రవి అత్రి గతంలోనూ వివిధ రాష్ర్టాల్లో పలు పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలను లీక్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. 2012లోనూ మెడికల్ ప్రవేశ పరీక్ష ప్రశ్నాపత్రాన్ని లీక్ చేశాడనే ఆరోపణలతో ఢిల్లీ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. బీహార్లో నీట్ పేపర్ లీకేజీ కేసులో మరో ఆరుగురు నిందితులను జార్ఖండ్లోలో పోలీసులు అరెస్టు చేశారు.