న్యూఢిల్లీ: ఏఐతో మానవాళి అంతం అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఆంథ్రోపిక్(Anthropic) పరిశోధకుడు జాకబ్ కాక్సన్ ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ భయాందోళనలకు తగినట్లే ఆంథ్రోపిక్ సంస్థ ఓ చేదు నిజాన్ని వెల్లడించింది. యెమెన్లోని హౌతీలు తమ క్లాడ్ ఏఐ టెక్నాలజీతో ఆయుధాలను డెవలప్ చేస్తున్నట్లు ఆంథ్రోపిక్ పేర్కొన్నది. క్షిపణులు, రాకెట్లకు చెందిన సాఫ్ట్వేర్ను క్లాడ్ ఏఐ ద్వారా డెవలప్ చేస్తున్నట్లు గుర్తించారు. క్లాడ్ మోడల్తో ఆయుధాలు తయారీ చేస్తున్న వివిధ బృందాలను గుర్తించినట్లు ఆ కంపెనీ వెల్లడించింది.
చైనా, రష్యా, యెమెణ్ దేశాల్లో క్లాడ్ మోడల్ ఆపరేషన్స్ జరుగుతున్నట్లు ఆంథ్రోపిక్ సంస్థ పేర్కొన్నది. యెమెన్లోని ఓ గ్రూపు.. మిస్సైల్ ప్రోగ్రామ్పై పనిచేస్తున్నదని, బాలిస్టిక్ క్షిపణులను ఆ గ్రూపు తయారు చేస్తున్నట్లు ఆంథ్రోపిక్ తెలిపింది. అయితే మానవ సాఫ్ట్వేర్ ఇంజినీర్ల స్థానంలో ఆ గ్రూపు క్లాడ్ కోడ్ను వాడినట్లు ఆంథ్రోపిక్ ఆందోళన వ్యక్తం చేసింది. ఎగిరే వాహనాల కోసం కావాల్సిన గైడెన్స్, నావిగేషన్, కంట్రోల్ సాఫ్ట్వేర్ డెవలప్ కోసం క్లాడ్ కోడింగ్ను వాడుతున్నట్లు తెలిసింది.
అయితే క్లాడ్ టెక్నాలజీ ఆధారంగా నిర్మించిన ఓ రాకెట్ ప్రయోగం వేళ విఫలమైనట్లు తెలిసిందన్నారు. క్షిపణికి సంబంధించిన సాఫ్ట్వేర్ను కేవలం క్లాడ్ కోడింగ్తో యెమెన్ సంస్థ డెవలప్ చేసినట్లు ఆంధ్రోపిక్ చెప్పింది. ఏఐ మోడల్స్ ద్వారా జీవాయుధాలను తయారు చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా ఆంథ్రోపిక్ సంస్థ తన హెచ్చరికలో పేర్కొన్నది.