Bihar | ఎన్డీయే పాలిత బీహార్ (Bihar)లో వరుసగా బ్రిడ్జిలు కూలుతున్న (Bridge Collapses) ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే వరుసగా నాలుగు బ్రిడ్జిలు కూలిపోయిన విషయం తెలిసిందే. గురువారం కిషన్బాగ్ జిల్లాలో, జూన్ 23న తూర్పు చంపారన్ జిల్లాలో, 22న సిశాన్లో, 19న అరారియాలో ఇలాగే వంతెనలు కూలిపోయాయి. తాజాగా మరో బ్రిడ్జి కూలింది. శుక్రవారం మధుబని (Madhubani) ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న వంతెన ఒక్కసారిగా కూలిపోయింది.
దాదాపు రూ.3 కోట్ల వ్యయంతో 75 మీటర్ల పొడవైన ఈ వంతెనను బీహార్ గ్రామీణ పనుల విభాగం 2021 నుంచి నిర్మిస్తోంది. ఇది మధుబని – సుపాల్ జిల్లాల మధ్య భూతాహి నదిపై ఉంది. అయితే, ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భూతాహి నదిలో నీటి మట్టం పెరిగింది. నీటి ఉద్ధృతికి నిర్మాణంలో ఉన్న వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. కాగా, రాష్ట్రంలో గత తొమ్మిది రోజుల వ్యవధిలోనే ఇది ఐదో ఘటన (fifth incident) కావడం గమనార్హం. దీంతో నిర్మాణ పనుల నాణ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
𝟗 दिन के अंदर बिहार में यह 𝟓वाँ पुल गिरा है।
मधुबनी-सुपौल के बीच भूतही नदी पर वर्षों से निर्माणाधीन पुल गिरा। क्या आपको पता लगा? नहीं तो, क्यों? बूझो तो जाने? #Bihar #Bridge pic.twitter.com/IirnmOzRSo
— Tejashwi Yadav (@yadavtejashwi) June 28, 2024
ఈనెల 19న అరారియా జిల్లాలోని పరారియా గ్రామంలో గత మంగళవారం నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయిన విషయం తెలిసిందే. రూ.12 కోట్ల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ఈ వంతెనలో అప్రోచ్ రోడ్ల నిర్మాణాన్ని ఇంకా చేపట్టలేదు. దీంతో ఈ వంతెనపై ప్రజా రవాణాకు ఇంకా అనుమతి ఇవ్వలేదు. బక్రా నదిపై కుర్సా కంటా, స్కిటీ ప్రాంతాలను కలుపుతూ ఈ బ్రిడ్జిని నిర్మించారు. బ్రిడ్జి కూలడానికి గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు.
ఆ తర్వాత ఈనెల 22న శనివారం ఉదయం సివాన్ జిల్లాలో చిన్నపాటి వంతెన ఒకటి కుప్పకూలింది. దారౌందా, మహారాజా గంజ్ బ్లాక్స్లోని రెండు గ్రామాలను కలుపుతూ కెనాల్పై కట్టిన ఈ బ్రిడ్జ్..చాలా ఏండ్ల క్రితం నాటిదని, కెనాల్లోని నీటి ప్రవాహ ధాటికి పిల్లర్లు దెబ్బతిని వంతెన కూలిందని జిల్లా కలెక్టర్ ముకుల్ కుమార్ గుప్తా తెలిపారు.
ఆ తర్వాతి రోజు అంటే జూన్ 23న ఆదివారం తూర్పు చంపారన్లో నిర్మాణంలో ఉన్న 16 మీటర్ల వంతెన కుప్పకూలింది. మోతిహారి బ్లాక్లో ఘోరసహాన్లో జరిగిన ఈ ఘటనలో ఎలాంటి ముప్పు వాటిల్లలేదని జిల్లా అధికారులు వెల్లడించారు. ఆమ్వా అనే గ్రామాన్ని ఇతర ప్రాంతాలకు కలుపుతూ కెనాల్పై ఈ బ్రిడ్జ్ను రూరల్ వర్క్స్ డిపార్ట్మెంట్ నిర్మిస్తున్నది. మోతీహరిలో (Motihari) రూ.1.5 కోట్లతో 40 అడుగుల విస్తీర్ణంలో వంతెన నిర్మిస్తున్నారు. ఇది ఆదివారం రాత్రి 12 గంటలకు అది ఒక్కసారిగా కూలిపోయింది. సిమెంటు, ఇసుక తగినపాళ్లలో సరిపోకపోవడం, కాస్టింగ్ కోసం ఏర్పాటుచేసిన సెంట్రింగ్ పైపు బలహీనంగా ఉండటంతో బ్రిడ్జి కూలిపోయిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
ఈనెల 27న గురువారం కూడా మరో వంతెన కూలింది. కిషన్గంజ్ (Kishanganj) జిల్లాలో కంకై నదికి చెందిన ఉపనదిపై నిర్మించిన 70 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పున ఉన్న బ్రిడ్జి కూలిపోయింది. ఈ వంతెనకు ఇటీవలే మరమ్మతులు ప్రారంభించారు. 2011లో నిర్మించిన ఈ బ్రిడ్జి కంకాయ్ నదిని, మహానందతో కలుపుతుంది. మడియాలోని ఈ బ్రిడ్జి పలువురు గిరిజనులకు ఉపయోగపడేది. కాగా, ఇటీవల నేపాల్ పరీవాహక ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు హఠాత్తుగా నదిలో నీటిమట్టం పెరిగింది. అందులో ఒక పిల్లర్ ప్రవాహ ఉద్ధృతికి పడిపోవడంతో బ్రిడ్జి కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు.
వరుసగా వంతెనలు కూలిపోతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నదులు, కాలువలపై నిర్మించిన వంతెనల పటిష్టతపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పబ్లిక్ వర్క్స్లో నాణ్యతా లోపాలు, అక్రమాల వల్లే ఈ ఘటనలు జరుగుతున్నాయని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. వరుస ప్రమాదాలతో అధికారులు కూడా ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ ప్రమాదవశాత్తు కూలిపోయాయా..? లేక ఎవరైనా కావాలనే కూల్చి వేస్తున్నారా..? అనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు.
Also Read..
Anant Weds Radhika | అనంత్ – రాధికల పెళ్లి వేళ.. సామూహిక వివాహాలకు ప్లాన్ చేసిన అంబానీ ఫ్యామిలీ
Delhi Rain | నేడు, రేపు ఢిల్లీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం : ఐఎండీ
Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. ఎదురెదురుగా ఢీ కొన్న రెండు కార్లు.. ఏడుగురు మృతి