Amit Shah : రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభ్యంతరం తెలిపారు. హిందువులు అని చెప్పుకునే వారు హింస గురించి మాట్లాడతారని, హింసకు పాల్పడతారని విపక్ష నేత స్పష్టంగా పేర్కొన్నారని చెప్పారు. కోట్లాది మంది ప్రజలు తాము హిందువులమని గర్వంగా చెప్పుకుంటారనే విషయం రాహుల్కు తెలియదని వ్యాఖ్యానించారు.
ఏ మతాన్ని హింసతో ముడిపెట్టడం తప్పని హితవు పలికారు. రాహుల్ హిందువులను అవమానించిందుకు క్షమాపణలు చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు. ఇక విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్సభ ప్రసంగంలో ఎక్కడా హిందువులను అవమానించలేదని ఆ పార్టీ నేత ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. తాను బీజేపీతో పాటు ఆ పార్టీ నేతల తీరు గురించే మాట్లాడానని రాహుల్ స్పష్టంగా చెప్పారని ఆమె పేర్కొన్నారు.
పార్లమెంట్ వెలుపల ప్రియాంక గాంధీ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కాగా, మోదీ సర్కార్ లక్ష్యంగా రాహుల్ తన లోక్సభ ప్రసంగంలో తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగంపై దాడి జరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. తాను మరో అంశం గమనించానని, ధైర్యం గురించి మాట్లాడేది కేవలం ఒక మతం కాదు. అన్ని మతాలు ధైర్యం గురించి మాట్లాడతాయని అన్నారు.
అధికారం, సంపద కేంద్రీకరణ, పేదలు, దళితులపై దమనకాండ గురించి ప్రశ్నించిన వారిని అణిచివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలు, రైతుల సమస్యలు కేంద్రానికి పట్టవని అన్నారు. రాజ్యాంగాన్ని రక్షించేందుకు తాము పోరాడుతున్నామని అన్నారు. ఇండియా కూటమి నేతలను ప్రభుత్వ ప్రోద్భలంతో ఈడీ, సీబీఐ వేధిస్తున్నాయని ఆరోపించారు. తప్పుడు కేసులు పెట్టి విపక్ష నేతలను వేధిస్తూ వారిని జైల్లో పెట్టి హింసిస్తున్నారని అన్నారు.
Read More :
New Criminal Code | నూతన చట్టాలతో విచారణ వేగవంతం, సత్వర న్యాయం : అమిత్ షా