Hathras Stampede : యూపీలోని హథ్రాస్లో జరిగిన తొక్కిసలాటలో 121 మంది ప్రాణాలు కోల్పోగా, 28 మంది గాయపడిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. భారీస్ధాయిలో జనం హాజరయ్యే ఈ కార్యక్రమానికి నిర్వాహకులకు అనుమతించడం ద్వారా ప్రభుత్వం సునిశితంగా వ్యవహరించలేదని యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ ఆరోపించారు. ఈ కార్యక్రమ నిర్వాహకులతో పాటు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారంతో పాటు బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. క్షతగాత్రులకు రూ. 25 లక్షలు పరిహారం అందచేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక హథ్రాస్ తొక్కిసలాట ఘటన బాధితులను అజయ్ రాయ్ బుధవారం పరామర్శించారు. బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు బాసటగా ఉంటామని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇక యూపీలోని హాథ్రాస్లో జరిగిన భోలే బాబా(Bhole Baba) సత్సంగ్లో విషాదం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఇంత పెద్దసంఖ్యలో ఓ ఆథ్యాత్మిక కార్యక్రమం జరుగుతున్నా ఆస్ధాయిలో పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. తొక్కిసలాటలో దాదాపు 121 మంది మరణించారు. ఈ ఘటనకు బాధ్యులైన బాబా ఆచూకీ అంతుబట్టడం లేదు. మంగళవారం మధ్యాహ్నం 3.30 నిమిషాలకు .. సత్సంగ్ ప్రాంగణం వద్ద తొక్కిసలాట జరిగింది. కానీ ఆ ఘటన తర్వాత భోలే బాబా ఆనవాళ్లు దొరకడం లేదు. ఆయన పరారీలో ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు.
Read More :
MUDA Irregularities Case | రాజీనామా డిమాండ్ను తోసిపుచ్చిన సిద్ధరామయ్య