బెంగళూరు: ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. బెంగళూరు నుంచి కొచ్చి వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ (Air India Express) విమానం ఇంజిన్లో ఒక్కసారిగా మంటల చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని బెంగళూరులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఆ సమయంలో విమానంలో 179 మంది ప్రయాణికులతోపాటు ఆరుగురు సిబ్బంది ఉన్నారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులను అత్యవసరంగా ఖాళీ చేయించడంతో పెను ప్రమాదం తప్పింది.
శనివారం రాత్రి 11.12 గంటలకు బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా IX 1132 విమానం కొచ్చికి బయల్దేరింది. ఎయిర్పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుడివైపు ఉన్న ఇంజిన్లో మంటల గుర్తించిన సిబ్బంది.. వెంటనే ఆ విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఏటీసీ)కు చేరవేశారు. దీంతో పూర్తిస్థాయి అత్యవసర ల్యాండింగ్కు అనుమతి లభించింది. విమానం ల్యాండ్ కావడానికి ముందే అగ్నిమాపక సిబ్బందిని రన్వేపై సిద్ధంగా ఉన్నారు.
విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులను సురక్షితంగా కిందికి దింపినట్టు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వెల్లడించింది. అంతా క్షేమంగా ఉన్నారని తెలిపింది. ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని పేర్కొంది. ప్రయాణికులకు కలిగిన అంతరాయానికి చింతిస్తున్నాని చెప్పింది. కాగా, విమానం ఇంజిన్లో మంటలు చెలరేగడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని ప్రకటించింది.
ఎయిర్ ఇండియా విమానాల్లో మంటలు చెలరేగడం గత మూడు రోజుల్లో ఇది రెండోసారి. ఈ నెల 17న ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్తున్న విమానంలో కూడా మంటలు చెలరేగాయి. విమానంలోని ఏసీ యూనిట్లో మంటలు అంటుకోవడంతో.. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో విమానంలో 175 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
Kochi-bound Air India Express flight with 179 passengers makes emergency landing in Bengaluru after engine catches fire@AirIndiaX @BLRAirporthttps://t.co/8FWyotoh1v pic.twitter.com/jifx6nQSYh
— ChristinMathewPhilip (@ChristinMP_) May 19, 2024