ముంబై: కలుషిత నీరు తాగి (Contaminated Water) సుమారు వంద మంది గ్రామస్తులు అస్వస్థతకు గురయ్యారు. వారిని పలు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్య బృందాలు ఆ గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ముగావ్ తండా గ్రామంలోని బావి నుంచి సరఫరా అయిన కలుషిత నీరు తాగి సుమారు వంద మంది అనారోగ్యం పాలయ్యారు. 107 ఇళ్లు 440 మంది జనాభా ఉన్న ఆ గ్రామంలో జూన్ 26, 27న 93 మంది గ్రామస్తులు కడుపు నొప్పి, విరోచనాలతో బాధపడ్డారు. దీంతో 56 మందిని స్థానిక ఆరోగ్య కేంద్రంలో, మరో 37 మందిని పొరుగున ఉన్న మంజరం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు.
కాగా, ముగావ్ తండా గ్రామానికి డాక్టర్ల బృందం చేరుకుని అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ఆ బావి నుంచి గ్రామానికి సరఫరా అయ్యే నీటి నమూనాలు సేకరించి పరీక్షించినట్లు చెప్పారు. బావిలోని నీరు కలుషితం కావడంతో దానిని మూసివేసినట్లు వెల్లడించారు. సమీపంలోని ఫిల్టర్ ప్లాంట్ నుంచి తాగు నీటిని గ్రామస్తులకు సరఫరా చేస్తున్నట్లు అధికారులు వివరించారు.