న్యూఢిల్లీ, జూన్ 26: లోక్సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ‘జై పాలస్తీనా’ అని నినాదం చేసిన హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు న్యాయవాది హరి శంకర్ జైన్ ఫిర్యాదు చేశారు. పార్లమెంట్ సభ్యుడిగా ఒవైసీపై అనర్హత వేటు వేయాలని కోరారు.
ఉభయ సభలకు చెందిన ఏ ఎంపీ అయినా ఇతర దేశం పట్ల విధేయత, నిబద్ధత చూపితే.. అలాంటి సందర్భంలో అతను/ఆమె పార్లమెంట్ సభ్యులుగా అనర్హులు అవుతారని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 102, 103 ప్రకారం ఒవైసీపై తక్ష ణం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కాగా, ఎంపీ ఒవైసీ మంగళవారం లోక్సభలో ప్రమాణం చేసిన అనంతరం ‘జై భీ మ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా’ అంటూ నినాదం ఇచ్చారు.
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ (96) బుధవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్లో చేర్చారు. వయో సంబంధిత అనారోగ్య సమస్యలతోనే ఆయనను దవాఖానలో చేర్చినట్టు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.
మూడు నెలల కిందటే కేంద్ర ప్రభుత్వం ఆయనకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రదానం చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి పురస్కారాన్ని అందజేశారు.
తిరువనంతపురం, జూన్ 26: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆధ్వర్యంలో జరిగిన నీట్, నెట్, ఇతర ప్రవేశ పరీక్షల్లో జరిగిన అక్రమాలపై దర్యాప్తు చేపట్టాలని, బాధిత విద్యార్థులకు తగిన న్యాయం చేయాలని కేరళ అసెంబ్లీ డిమాండ్ చేసింది. అధికార ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష యూ డీఎఫ్ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించాయి.
పరీక్షల నిర్వహణలో ఎన్టీఏ విశ్వసనీయతపై సందేహం వ్యక్తం చేశాయి. ఈ పరీక్షల అక్రమాలకు కారణం కేంద్రమేనని ఎల్డీఎఫ్ ఎమ్మెల్యే ఎం విజ్జీన్ ఆరోపించారు. కేంద్రం రాజకీయ ప్రయోజనాలకు అనుకూలంగా విద్యా విధానాన్ని మారుస్తున్నదని ఎల్డీఎఫ్ ఆరోపించింది.
చెన్నై : కులాలవారీ జనాభా లెక్కల సేకరణను త్వరగా ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తమిళనాడు శాసనసభ బుధవారం ఏకగ్రీవంగా ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి బీజేపీ సహా పలు పార్టీలు మద్దతిచ్చాయి.
అయితే సభలో గందరగోళం సృష్టిస్తున్నందుకు ఏఐఏడీఎంకే సభ్యులను సస్పెండ్ చేయడంతో వారు లేకుండానే ఈ తీర్మానం ఆమోదం పొందింది. స్టాలిన్ మాట్లాడుతూ, సెన్సస్ చట్టం ప్రకారం జనాభా లెక్కలను సేకరించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి, ప్రజల సాంఘిక-ఆర్థిక స్థితిగతుల సమాచారాన్ని సేకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందన్నారు.
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలతో కాంగ్రెస్ను ఇబ్బంది పెట్టి చివరకు పదవి నుంచి తప్పుకున్న కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా తిరిగి తన పూర్వ పదవిలో నియమితులయ్యారు. పార్టీ ఓవర్సీస్ చైర్మన్గా ఆయనను తిరిగి నియమిస్తున్నట్టు కాంగ్రెస్ బుధవారం ప్రకటించింది.
పిట్రోడా వారసత్వ పన్ను గురించి, తర్వాత భారతీయుల రంగు, ఆకారం, వేష భాషలను విదేశీయులతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్కు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. దీంతో ఆయన పదవి నుంచి తప్పుకున్నారంటూ మే 8న కాంగ్రెస్ ప్రకటించింది. ఇప్పుడు ఎన్నికలు ముగిసి అంతా సద్దుమణగడంతో ఆయనను తిరిగి పూర్వ పదవిలోనే నియమిస్తున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది.