భోపాల్: 2018 జూలై 1న.. ఉత్తర ఢిల్లీలోని బురారీలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది సామూహికంగా ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇదే తరహా ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకున్నది. అలీరాజ్పూర్ జిల్లాలో ఓ రైతు కుటుంబం ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపింది.
తల్లిదండ్రులు, ముగ్గురు పిల్లలు అనుమానాస్పద స్థితిలో సోమవారం తమ ఇంట్లోని సీలింగ్కు వేలాడుతూ, మరణించి కనిపించారు. మృతులను రాకేశ్ సింగ్, ఆయన భార్య లలిత, కుమార్తె లక్ష్మి, కుమారులు ప్రకాశ్, అక్షయ్గా గుర్తించారు. వీరి బంధువులు వీరి ఇంటికి వచ్చి, తలుపులు తెరచి చూసే సరికి మృతదేహాలు కనిపించడంతో, పోలీసులకు సమాచారం ఇచ్చారు.
తృణమూల్ నేత జేసీబీ అరెస్ట్
కోల్కతా: వివాహేతర సంబంధం కలిగి ఉన్నారని ఆరోపిస్తూ ఓ జంటను నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా చితకబాదిన టీఎంసీ నేత తజిముల్ ఇస్లాం వురపు జేసీబీని ఆదివారం అరెస్ట్ చేసినట్లు పశ్చిమ బెంగాల్ పోలీసులు వెల్లడించారు. లఖిపూర్ గ్రామ పంచాయతీలోని దిఘల్గావ్ గ్రామం లో జూన్ 28న తజిముల్ బహిరంగంగా ఓ మహిళను, ఓ పురుషుడిని దారుణంగా కొట్టినట్లు కనిపిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.