లక్నో: సోషల్ మీడియా రీల్లో పన్ను విరిగిన వ్యక్తిని ఒక మహిళ గమనించింది. చిన్నప్పుడు ఇంటి నుంచి వెళ్లిన సోదరుడిగా అనుమానించింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా సంప్రదించి వివరాలు తెలుసుకుంది. దీంతో తోబుట్టువులైన వారిద్దరూ 18 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. (Siblings Reunite) సినిమా కథను తలపించేలా ఉన్న ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లాలో జరిగింది. ఫతేపూర్లోని ఇనాయత్పూర్ గ్రామానికి చెందిన బాల గోవింద్ 2006లో పని కోసం ఇంటిని వీడి ముంబై వెళ్లాడు. ఒక రోజు అక్కడ అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో ఇంటికి తిరిగి వచ్చేందుకు రైలు ఎక్కాడు. అయితే ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు బదులు రాజస్థాన్ రాజధాని జైపూర్కు చేరుకున్నాడు.
కాగా, అనారోగ్యంతో ఉన్న గోవింద్కు రైల్వే స్టేషన్లో ఒక వ్యక్తి పరిచయమయ్యాడు. ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత అతడి ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇచ్చాడు. దీంతో జైపూర్లో స్థిరపడిన గోవింద్ తన కుటుంబ సభ్యులు, స్నేహితులను మరిచిపోయాడు. ఈశ్వర్ దేవిని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
మరోవైపు గోవింద్ తరచుగా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పోస్ట్ చేస్తుంటాడు. జైపూర్లోని పలు ప్రాంతాలను సందర్శించి రీల్స్ చేసేవాడు. అతడి ఒక రీల్ను రాజకుమారి అనే మహిళ చూసింది. అతడి విరిగిన పంటిని ఆమె గమనించింది. మరిన్ని రీల్స్ పరిశీలించిన రాజకుమారి చిన్నప్పుడు ఇంటి నుంచి వెళ్లిపోయిన సోదరుడు గోవింద్గా అనుమానించింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా అతడ్ని సంప్రదించి వివరాలు అడిగింది. దీంతో వారిద్దరూ తోబుట్టువులని తెలుసుకున్నారు.
కాగా, గోవింద్తో ఫోన్లో మాట్లాడిన రాజకుమారి సొంత గ్రామానికి తిరిగి రావాలని కోరింది. జూన్ 20న అతడు ఆ గ్రామానికి చేరుకున్నాడు. దీంతో తోబుట్టువులైన వారిద్దరూ 18 ఏళ్ల తర్వాత స్వయంగా కలుసుకున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.