Chandipura Virus | గుజరాత్ రాష్ట్రం సబర్కాంతా (Sabarkantha) జిల్లాలో చాందిపురా వైరస్ (Chandipura Virus) కలకలం రేపుతోంది. ఈ వైరస్ సోకి ఐదు రోజుల్లో ఆరుగురు చిన్నారులు మృత్యువాతపడ్డారు. మొత్తంగా ఈ వైరస్ బారినపడినవారి సంఖ్య 12కు చేరినట్లు ఆరోగ్య శాఖ మంత్రి (Gujarat Health Minister) రుషికేశ్ పటేల్ (Rushikesh Patel) తాజాగా వెల్లడించారు.
వైరస్ సోకిన 12 మంది రోగుల్లో నలుగురు సంబర్కాంత్ జిల్లాకు చెందిన వారని మంత్రి తెలిపారు. ముగ్గురు ఆరావళి, మహిసాగర్, ఖేడా జిల్లాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నట్లు పేర్కొన్నారు. మరో ముగ్గురు మధ్యప్రదేశ్ (ఒకరు), రాజస్థాన్ (ఇద్దరు)కు చెందిన వారని చెప్పారు. ప్రస్తుతం వారంతా గుజరాత్లో చికిత్స పొందుతున్నారన్నారు. ఈ అనుమానిత చాందిపురా వైరస్ వల్ల ఆరు మరణాలు సంభవించినట్లు చెప్పారు. అయితే, పూర్తిస్థాయి ధ్రువీకరణ కోసం నమూనాలను పుణెలోని వైరాలజీ ల్యాబ్కు పంపినట్లు పేర్కొన్నారు. నమూనాల ఫలితాల అనంతరం ఆ మరణాలు చాందిపురా వైరస్ వల్ల సంభవించాయో లేదో స్పష్టంగా తెలుస్తుందన్నారు.
ఈ ఆరింటిలో ఐదు మరణాలు సబర్కాంతా జిల్లాలోని హిమత్నగర్లోని సివిల్ ఆసుపత్రిలో నమోదైనట్లు మంత్రి తెలిపారు. చాందిపురా వైరస్ అంటు వ్యాధి కాదని మంత్రి పేర్కొన్నారు. అయితే, ప్రభావిత ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో నిఘా పెట్టినట్లు చెప్పారు. సుమారు 4,487 ఇళ్లలో 18,646 మంది వ్యక్తులను పరీక్షించినట్లు తెలిపారు. వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధక చర్యలు చేపట్టామని.. ఆరోగ్య శాఖ 24 గంటలు పని చేస్తోందని మంత్రి వివరించారు.
మహారాష్ట్రలోని చాందిపురా గ్రామంలో తొలిసారి ఈ వైరస్ను గుర్తించారు. ఇది పిల్లలకు వ్యాపిస్తుంది. వైరస్ సోకిన వారికి ఫ్లూ వంటి లక్షణాలతో జ్వరం వస్తుంది. తీవ్రమైన మెదడు వాపు కూడా కనిపిస్తుంది. దోమలు, ఈగలు వంటివాటి ద్వారా ఇది వ్యాపిస్తుంది.
Also Read..
India – Russia | ఉక్రెయిన్తో యుద్ధాన్ని ముగించేలా పుతిన్తో మాట్లాడండి.. భారత్కు అమెరికా విజ్ఞప్తి
Soldiers | జమ్మూలో ఉగ్రవాదుల ఘాతుకాలు.. 32 నెలల్లో 48 మంది జవాన్ల వీరమరణం