NEET Paper Leak | ఎంబీబీఎస్ సహా వైద్య విద్యా కోర్సుల్లో అడ్మిషన్లకు ఏటా నిర్వహిస్తున్న నీట్ యూజీ-2024 పరీక్షలో అక్రమాలపై విద్యార్థులు, విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. తొలుత బీహార్లో నీట్-2024 ప్రశ్నపత్రం లీకైనట్లు వచ్చిన వార్తలను కేంద్రం, నీట్ పరీక్ష నిర్వాహక సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తోసిపుచ్చాయి. కానీ పరీక్ష తేదీకి ముందు రోజే నీట్ పరీక్షా పత్రం తమ చేతికి వచ్చిందని ఇదే కేసులో బీహార్లో అరెస్టయిన విద్యార్థులు పోలీసుల విచారణలో అంగీకరించారు.
నీట్-2024 లీకేజీ ఆరోపణలపై దర్యాప్తు కోసం బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకూ సిట్ అధికారులు 14 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ఒక జూనియర్ ఇంజినీర్, ముగ్గురు నీట్ అభ్యర్థులు ఉన్నారు. ఈ నలుగురిలో ఓ నీట్ అభ్యర్థి.. జూనియర్ ఇంజినీర్కు మేనల్లుడని తెలుస్తోంది.
సదరు నీట్ పరీక్షకు హాజరైన విద్యార్థి పోలీసుల విచారణలో స్పందిస్తూ.. ‘రాజస్థాన్ లోని కోటాలో నేను నీట్ కోసం ప్రిపేర్ అవుతున్నా. నాకు మా మామయ్య ఫోన్ చేసి, నీట్ పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేశా.. ఇంటికి రమ్మన్నారు. గత నెల ఐదో తేదీన నీట్ పరీక్ష జరగడానికి ఒక రోజు ముందు అంటే మే నాలుగో తేదీ రాత్రి నా మిత్రులతో కలిసి నా మామయ్య ఇంటికి వెళ్లా.. అక్కడ నాకు నీట్ ప్రశ్నపత్రం, ఆన్సర్ షీట్ ఇచ్చారు. ఆ రాత్రంతా వాటిని కంఠస్థం చేశాం. ఐదో తేదీన పరీక్షా కేంద్రంలో మాకు ఇచ్చిన ప్రశ్నపత్రం.. ముందు రోజు మా మామయ్య ఇచ్చిన పేపర్ ఒక్కటే అని తేలింది’ అని చెప్పారు. ఇదే విషయమై రాత పూర్వకంగా రాసివ్వడంతో నీట్ యూజీ 2024 అక్రమాల వ్యవహారం మరింత తీవ్రమైంది.
ఇదిలా ఉంటే నీట్ పరీక్ష నిర్వహణలో అవకతవకలపై గురువారం మరోమారు విచారించిన సుప్రీంకోర్టు.. దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో జరుగుతున్న విచారణలపై స్టే విధించింది. ఎన్టీఏ అభ్యర్థన మేరకు అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని హైకోర్టులను ఆదేశించింది. నీట్ యూజీ 2024 పరీక్ష రద్దు కోరుతూ దాఖలైన పిటిషన్ మీద జవాబివ్వాలని ఎన్టీఏ, కేంద్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అయినా ఎంబీబీఎస్ తదితర వైద్య కోర్సుల్లో అడ్మిషన్లకు నీట్ కౌన్సెలింగ్ ప్రక్రియను నిలువరించబోమని కూడా స్పష్టం చేసింది. బీహార్లో నీట్ పరీక్షా పత్రం లీకేజీ కోసం సంబంధిత ముఠా రూ.32 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తున్నది. అలా లీకైన ప్రశ్నపత్రం అందుకున్న విద్యార్థుల్లో ఒకరికి 720 మార్కులకు 185, మరొకరికి 300, మరో ఇద్దరికి 581, 483 మార్కులు వచ్చాయని తెలుస్తున్నది.