Sayooj S Chandran | తిరువనంతపురం: నమ్మకం, కృషి ఉంటే అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చునని నిరూపించాడు కేరళకు చెందిన బీఎస్సీ ఫైనల్ ఇయర్ విద్యార్థి సయూజ్ ఎస్ చంద్రన్. తనకున్న జ్ఞానాన్ని ‘బోధించి’ రూ.10 లక్షలు సంపాదించాడు. ఆ డబ్బుతో ఓ కారు కొని తాను చదువుతున్న కళాశాలలో సెలబ్రిటీగా మారిపోయాడు. కాసర్గోడ్లోని మారుమూల కొండ ప్రాంతంలో ఉన్న రాజాపురం గ్రామంలోని ఓ కాలేజీలో చదివే ఓ గ్రామీణ విద్యార్థి స్ఫూర్తిదాయక కథ ఇది.
సయూజ్ తండ్రి చంద్రన్ ఆర్మీలో పని చేసి రిటైర్ అయ్యారు. తల్లి సతి చంద్రన్ సామాజిక కార్యకర్త, గ్రామీణ ఉపాధి హామీ పథకం సూపర్వైజర్. సయూజ్ యూట్యూబ్లో సొంతంగా ఓ కోచింగ్ చానల్ను నిర్వహిస్తున్నాడు. అందులో సివిల్స్కు సిద్ధమవుతున్న అభ్యర్థులకు కరెంట్ అఫైర్స్, సివిల్ సర్వీస్ అప్టిట్యూడ్ టెస్ట్, చరిత్ర, జాగ్రఫీ, జనరల్ స్టడీస్ బోధిస్తూ డబ్బు సంపాదిస్తున్నాడు. తాను 2025 మే నెలలో సివిల్స్ పరీక్షలకు హాజరవుతానని, తాను నేర్చుకున్న దానిని ఇతరులతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఐఏఎస్ హబ్ మలయాళం యూట్యూబ్ చానల్ను ప్రారంభించానని సయూజ్ చెప్పారు. ఒక ఏడాదిలో ఈ చానల్ ద్వారా వచ్చిన సొమ్ముతో కారు కొన్నానని చెప్పారు. సయూజ్ చానల్ గురించి అతడు చదివే కాలేజీ లెక్చరర్ ఆశా చాకో మాట్లాడుతూ… తమ కళాశాలలో సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు చాలా మంది ఉన్నారని.. అయితే సయూజ్ బోధించినట్లుగా మరెవరూ బోధించలేరని చెప్పారు. సయూజ్ వద్ద కాలేజీ టీచర్లు, గృహిణులు, ప్రభుత్వోద్యోగులు, ఐటీ ప్రొఫెషనల్స్, కెమికల్ ఇంజినీర్ల వంటివారు శిక్షణ పొందుతున్నారని ఆమె తెలిపారు.
తన బోధన గురించి సయూజ్ మాట్లాడుతూ కాలేజీకి బస్సులో వెళ్లి, వచ్చేటపుడు ఐప్యాడ్లో ఆన్లైన్ న్యూస్పేపర్లను చదువుతానని చెప్పారు. ఈ పత్రికల ఆధారంగానే తయారు చేసుకొన్న నోట్స్ను వీడియో పీపీటీ తయారు చేసి తన చానల్లో అప్లోడ్ చేస్తానని చెప్పారు. నోట్స్ బాగుందని, తాము రుసుము చెల్లిస్తామని వీక్షకులు చెప్పడంతో, తన చానల్ను చెల్లింపు(పెయిడ్) చానల్గా మార్చానన్నారు. కొత్తగా చేరినవారికి రోజువారీ మూల్యాంకన, రాత పరీక్షలను నిర్వహిస్తున్నానని తెలిపారు.