NEET-PG Councelling | పీజీ మెడికల్ కోర్సుల్లో చేరడానికి నీట్-పీజీ ఎంట్రన్స్ నిర్వహిస్తోంది కేంద్రం. ఈ విద్యా సంవత్సరంలో రెండు విడుతల కౌన్సిలింగ్ ముగిసిన తర్వాత దేశవ్యాప్తంగా పీజీ కోర్సుల్లో దాదాపు 13 వేల పీజీ మెడికల్ సీట్లు ఖాళీగా ఉన్నాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. అయినప్పటికీ నీట్-పీజీ ఎంట్రన్స్లో క్వాలిఫయింగ్ మార్క్స్ పర్సంటైల్ జీరోకు తగ్గించడం సరైన చర్యేనని ఆ వర్గాల కథనం.
కేంద్ర వైద్యారోగ్యశాఖ వర్గాల కథనం ప్రకారం దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో మొత్తం 68,142 పీజీ మెడికల్ సీట్లు ఉన్నాయి. వీటిని నీట్-పీజీ ఎంట్రన్స్ ద్వారా భర్తీ చేస్తారు. ఈ ఏడాది ఈ ఎంట్రన్స్కు 2.2 లక్షల మంది మెడికల్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు హాజరయ్యారు.
తొలుత క్వాలిఫయింగ్ పర్సంటైల్ 50 శాతంగా కేంద్రం నిర్ణయించింది. అంటే 50 శాతం మంది అభ్యర్థులు తమ ర్యాంకులను బట్టి కౌన్సెలింగ్కు హాజరు కావచ్చు. కానీ, రెండు రౌండ్ల కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత కూడా భారీగా సీట్లు మిగిలిపోయాయి. గతేడాది కూడా క్వాలిఫయింగ్ పర్సంటైల్ 20 శాతానికి తగ్గించి.. ఖాళీ సీట్లను భర్తీ చేశారని ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.